రాజకీయాల్లో తమదంటూ ముద్రవేసిన వారు చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్ నుంచి వైఎస్ దాకా, గతంలో అయితే, టంగుటూరి వంటి వారు తమదైన శైలిలో ముద్ర వేశారు. అయితే, తాజాగా తనదైన మార్కుతో ఏపీ రాజకీయాలపై ముద్ర వేయడం గమనార్హం. హైటెక్ సీఎంగా గుర్తింపు పొందిన బాబు.. తన పాలనను ఎవరూ విమర్శించరాదని అంటుండడం మరింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి గద్దెనెక్కాలని చూస్తున్న చంద్రబాబు.. తనపై విమర్శలు చేసేవారికి అర్హత ఉండాలని చెబుతుండడం మరింత వింతగా అనిపిస్తోంది. ‘‘కొందరు నన్ను రేయింబవళ్లు విమర్శిస్తున్నారు. అలా విమర్శించే వాళ్ల అర్హత ఏంటి? వాళ్లు జీవితంలో ఏదైనా సాధించారా? క్రమశిక్షణతో ముందుకెళ్లారా? దీనిపై యువత ఆలోచించాలి’’ అంటూ తాజాగా బాబు వైసీపీ అధినేత జగన్పై విమర్శలు సంధించారు.
‘‘ఎవరికైనా క్యారెక్టర్ చాలా ముఖ్యం. ఒకసారి క్యారెక్టర్ పోతే మళ్లీ జీవితంలో దాన్ని సాధించలేం’’ అని తెలిపారు. వాస్తవాని కి ఈ విషయంపై కొన్నాళ్లుగా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. సొంతగా పార్టీ పెట్టుకుని, కాంగ్రెస్ను పక్కన పెట్టి సొంత పార్టీ పెట్టుకుని ముందుకు సాగుతున్న జగన్ క్యారెక్టర్ ఏంటో.. టీడీపీని చంద్రబాబు ఎలా హస్తగతం చేసుకున్నారో ఆ రాజకీయాలను తెలుగు ప్రజలు ఇంకా మరిచిపోలేదనే విషయం బాబు గుర్తుంచుకోవాలని అంటున్నారు పరిశీలకులు. ఇక, తాను తప్ప అధికారంలోకి ఎవరూ రాకూడదనే వింత పోకడలు సైతం బాబు రాజకీయాల్లోనే మనకు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీకి, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రతిపక్ష పార్టీకి కూడా ఎంతో సామర్ధ్యం విలువ ఉంటాయి.
కానీ, చంద్రబాబు మాత్రం మనకు విపక్షంతో పనేముంది అని పలుమార్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక, పవన్ గురించి, జనసేన పార్టీ గురించి కూడా చంద్రబాబు పరోక్షంగాను, ప్రత్యక్షంగాను విమర్శలు చేశారు. ‘‘సినిమాలు వేరు, జీవితం వేరు. ఎక్కడో ఒకరో ఇద్దరో సాధిస్తారు తప్ప అంతా కాదు’’ అనడం ద్వారా పవన్ ఏమీ సాధించలేడనే వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి గత ఎన్నికల్లో చంద్రబాబు ఏరికోరి... పవన్ను పిలిచి మరీ ప్రచారం చేయించుకున్నారు. మరి ఆయనలో ఏముందని, తనలో ఏం లేదని అప్పుడు అలా వ్యవహరించారు? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు వద్దు. అంతా టీడీపీనే రావాలి. చంద్రబాబు, చినబాబు, బుల్లిబాబులే సీఎంలు కావాలి. ఇదీ టీడీపీ రాజకీయం.. చంద్రబాబు శకం.