ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ రాజకీయాలు మరింత ముదిరాయి. ఈ క్రమంలోనే అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వినియోగించుకుంటున్నారు. ఆయన ఎక్కడ ఏవేదిక ఎక్కినా గడిచిన ఆరు మాసాలుగాఆ యన చెబుతున్న ఏకైక మాట ఒక్కటే.. టీడీపీని గెలిపించండి.. టీడీపీ గెలుపు చారిత్రక అవసరం! ఇదే ఆయన చెబుతున్నారు. ఇటీవల ఆయన ఐక్య రాజ్యసమితిలో పాల్గొని మాట్లాడేందుకు అమెరికా వెళ్లారు. ఈ సమయంలోనూ ఆయన అక్కడి ఎన్నారైలతో మాట్లాడారు. అప్పుడు కూడా ఆయన తన నోటి వెంట ఓటు మాటలే మాట్లాడారు. ఎన్నారైలకు కూడా ఓటు హక్కు ఉంటుందని, మీరు టీడీపీనే గెలిపించాలని చంద్రబాబు కోరారు.
తాజాగా చంద్రబాబు యువతను కూడా తన ట్రాక్లోకి లాక్కునేందుకు చేసిన ప్రయత్నం దాదాపు సఫలమైందనే అంటు న్నారు. ఎన్నికల కోసం యువతను దేబిరించడం లేదని అంటూనే ఆయన యువతను తన పార్టీకి ఓట్లు వేయాలని కోరుకోవడం సంచలనంగా మారింది. రాజకీయ చాణిక్యుడు అయిన చంద్రబాబు.. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసిన వ్యక్తి. అదేసమయంలో ఆయన యువతను తనవైపు తిప్పుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగ యువత 8 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. అయితే, వివిధ నిబంధనలు, షరతుల నేపథ్యంలో వీరి సంఖ్య రెండు లక్షలకు దిగిపోయింది. ఇప్పుడు లక్షాఅరవై వేల మంది పోగయ్యారు.
వీరికి భృతి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడనని చెబుతూనే రాజ కీయాలు మాట్లాడడం, యువత తనకు మద్దతివ్వాలని కోరుకోవడం వంటి కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. 2004లో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిఉంటే అభివృద్ధిలో ఎక్కడికో వెళ్లేవాళ్లమని, ఇప్పుడు కొత్త రాష్ట్రం. కష్టపడి చేస్తున్నాం.
2024కు దేశంలో తొలి మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా, 2029కి దేశంలో నెంబర్వన్ రాష్ట్రంగా నవ్యాంధ్రను నిలుపుతా. 2050 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఏపీ ఉంటుంది. ఇది సాధించడం నా ఒక్కడి వల్లే కాదు. మీ సహకారం అవసరం. అంటూనే యువత ఓట్లకు గేలం వేశారు బాబు. యువత మొత్తం టీడీపీకి సహకరించాలని ఆయన సూచించారు. అంతేకాదు, టీడీపీ ప్రభుత్వం మీకు నెలకు రూ.వెయ్యి ఇస్తున్నప్పుడు మీ ఓట్లు టీడీపీకే వెయ్యాలనే ధోరణిలో చంద్రబాబు వ్యవహరించడం గమనార్హం.