సరుకు అంతంతం మాత్రం ప్రచారం అనంతం ఇదీ మనం చూసే ఏపి ముఖ్యమంత్రి గారి పాలనాతీరు. ఖచ్చితంగా పావలా కోడికి ముప్పావలా మసాలా ఆయన నైజం. అలాంటిది మొన్న యుఎన్ ఓ లో ఆయన ఆధునిక సేంద్రియ వ్యవసాయంపై ప్రసంగాన్నిఎందుకు ప్రచారంలోకి తీసుకురాలేదనేది సకలాంద్రుల అనుమానం. దానికి ముందెంతగానో ప్రచారం హంగామా చేసి కార్యక్రమం అయ్యాక ప్రదర్శించే మౌనంపై జనానికి అంతులేనంత డౌట్.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఐక్యరాజ్యసమితి (యూ ఎన్ ఓ) లో ప్రసంగించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వపోర్టల్ లో ఎందుకు పెట్టలే దని ప్రతిష్టాత్మక రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ కుమార్ ప్రశ్నించారు. నేడు ఉండవల్లి అరుణ కుమార్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ జీరో బడ్జెట్ పేరిట, నేచురల్ ఫార్మింగ్ గురించి వివరించి, ₹16600 కోట్ల విలువైన ఎంవోయూలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, "సిఫ్ సంస్థ"తో కుదుర్చుకున్న విషయాలను ప్రజలకు చెప్పనవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
భారత్ వ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 20 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ కే వచ్చినట్టు చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతేకాదు మన రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి వచ్చే రైతులను పోలవరం ప్రాజెక్టును చూపించేందుకు తీసుకెళ్లడానికి ₹ 20 కోట్లు ఖర్చుచేయడం దారుణమని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఆర్ధికవేత్త కుటుంబరావు స్పందించాలని కోరారు. ఇదే విషయం గురించి "ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ" ను ప్రశ్నిస్తే ఆర్టీఐ లోని సెక్షన్ 8 ప్రకారం వివరాలు ఇవ్వడం కుదరదని చెప్పారని వెల్లడించారు.