టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో రెండో నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన చేస్తున్నారన్న వార్తలు అధికార పార్టీలోనే జోరుగా చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్న కేసీఆర్ ప్రత్యర్థులకు ఊహించని విధంగా ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. అధికార పార్టీలో చాలా మంది సిట్టింగులు, ఆశావాహులకు టిక్కెట్లు దక్కకపోవడంతో వారంతా ఓ వైపు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే రోజు ఆయనలో ఉన్నంత కాన్ఫిడెన్స్ ఈ రోజు ఉందా ? అని ప్రశ్నించుకుంటే సగటు తెలంగాణ ఓటరు సైతం లేదనే చెబుతాడు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చెయ్యడంతో పాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ? ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట. గతంలో సిద్ధిపేట నుంచి వరుసగా అసెంబ్లీకి ఎన్నిక అయిన ఆయన ఎంపీగా కరింనగర్, మహబూబ్నగర్తో పాటు గత ఎన్నికల్లో మెదక్ నుంచి సైతం లోక్సభకు పోటీ చేసి గెలిచారు. గజ్వేల్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి సీఎం స్థాయి మెజారిటీ దక్కించుకోలేకపోయిన కేసీఆర్ నాలుగు ఏళ్లుగా నియోజకవర్గంలో ఓ మోస్తరుగా అభివృద్ధి చేశారు. అంతే కాకుండా గజ్వేల్ అభివృద్ధి కోసం గజ్వేల్ అభివృద్ధి అథారిటీ (గడా) ఏర్పాటు చేసినా అభివృద్ధి మాత్రం సీఎం స్థాయిలో లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అలాగే ఎర్రవెల్లిలోని తన 70ఎకరాల ఫామ్ హౌస్ కోసమే కొంత మేర అభివృద్ధి పేరిట ఇక్కడ కేసీఆర్ హడావిడి చేసారన్న అపవాద సైతం ఆయనపై ఉంది. ఇక గజ్వేల్లో ఎప్పటికప్పుడు సర్వేలు చేయించిన కేసీఆర్ అక్కడ తాను అనుకున్న స్థాయిలో తనపై సానుకూలత లేదని సర్వేల్లో తేలినట్టు సమాచారం. అ క్రమంలోనే ఇప్పుడు గజ్వేల్తో పాటు మరో సురక్షిత నియోజకవర్గం కోసం అన్వేషణ చేస్తునట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇంటిలిజన్స్ నివేదికలు సైతం కేసీఆర్కు గజ్వేల్లో గెలుపు సంగతి ఎలా ఉన్నా ? సీఎం రేంజులో రావాల్సినంత మెజారిటీ రాదని స్పష్టం చేయడంతో కేసీఆర్ సైతం షాక్ అయ్యినట్టు తెలిసింది.
కేవలం ఇంటిలిజెన్స్ నివేదికలే కాకుండా రెండు మూడు ప్రైవేట్ ఏజన్సీలతో ఆయన సొంతంగా చేయించుకున్న సర్వేలోనూ అదే రిపోర్ట్ రావడంతో కేసీఆర్ గజ్వేల్తో పాటు మేడ్చల్ నియోజకవర్గంలోనూ పోటీ చేస్తే ఎలా ఉంటుందని భావిస్తునట్టు తెలస్తోంది.అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఇప్పటికే టిక్కెట్ నిరాకరించారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి అక్కడ పోటీకి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు గజ్వేల్తో పాటు మేడ్చల్లో కూడా కేసీఆర్ పోటీ చేస్తారన్న వార్తలతో ఆయన డెసిషన్ ఎలా ఉంటుందన్నది సస్పెన్స్గానే ఉంది. ఏదేమైనా గజ్వేల్లో మాత్రం కేసీఆర్కు పూర్తి సానుకూల వాతావరణం అయితే లేదు.