ఉట్టికెగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతానన్నట్టుగా ఉంది-తెలంగాణా బీజేపీ నాయకుల పరిస్థితి! గత ఎన్నికల్లోనే(అంటే.. తెలంగాణా ఏర్పాటుకు చిన్నమ్మ సుష్మాస్వరాజ్ సహకరించారు- పార్లమెంటు తలుపులు మూసినా.. బీజేపీ ఏపీ విభజ నకు సహకరించింది) చచ్చీచెడీ చావుతప్పిన పరిస్థితిని కొనితెచ్చుకున్న బీజేపీ.. ఇప్పుడు మాత్రంవ్యూహాత్మకంగా దా దాపు 90 స్థానాలకు పైగానే ఆశలు పెట్టుకోవడం గమనార్హం. మరి ఇది సాధ్యమేనా? ఇప్పుడు కేంద్రం సహకరించడం లేదని పదేపదే చెబుతున్న కేసీఆర్ దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా కమలనాధులకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయినా కూడా తాము 90 స్థానాలకు పైగానే సాధిస్తామని చెప్పడం దేనికి నిదర్శనమో బీజేపీ నాయకులు చెప్పాలి. మేం లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం అసాధ్యమని చెబుతున్నారు.
నిజానికి ఇలాంటి ఎమోషనల్ వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో కామనే! అయితే, ప్రాతిపదిక లేని ఇలాంటి వ్యాఖ్యల విషయంలో ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారనే విషయాన్ని కమలం పార్టీ నాయకులు గుర్తించాలి. తెలంగాణ ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు, అందరికంటే ముందు తెలంగాణ జెండాను పైకెత్తిన పార్టీ బీజేపీ అని, 1997-98 నుంచి పోరాటం చేసిందని అంటున్నారు. బీజేపీ అంటే అభివృద్ధి అని, టీఆర్ఎస్ అంటే అవినీతి అని వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుని, ప్రజలు ఎక్కడ లెక్కలు అడుగుతారోనన్న భయంతో టీఆర్ఎస్ జెండా ఎత్తేసిందన్న విమర్శ కూడా సహేతుకంగా లేకపోవడం గమనార్హం.
నేను... నా కొడుకు... నా కూతురు అన్నట్టు కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారన్న వ్యాఖ్యలు ఏనాటి నుంచో ఈ రాష్ఠ్రంలో వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీ మాత్రం ఆశించిన మేరకు ఇప్పటికీ దూసుకుపోయిన దాఖలా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు కూడా కేంద్రంలోని పెద్దలు కేసీఆర్ను, హైదరాబాద్ను పొగడ్తలతో ముంచెత్తారు.
దీంతో స్థానిక నాయకులు కేసీఆర్పై యుద్ధం ఎలా చేయాలో తెలియనిపరిస్థితిలో కూరుకుపోయారు. ఇప్పటికిప్పుడు రచిస్తున్న వ్యూహాలు కూడా కేసీఆర్ను నిలువరించేవిగా కనిపించడం లేదు. ముఖ్యంగా స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు, సీఎం కుర్చీ విషయంలో పెరుగుతున్న అంతర్గత పోరు.. వంటివి బీజేపీని తీవ్రంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయని అంటున్నారు. మరి వీటిపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ను తిట్టిపోసి సాధించేది ఏంటి? !