ఎన్నికలకు వెళ్తున్న తెలంగాణలో అధికార పార్టీలో నిన్న మొన్నటి వరకు అసమ్మతి రాగం వినిపించింది. తమకు టికెట్ ఇవ్వమంటే ఇవ్వలేదని, తమను గుర్తించలేదని నాయకులు పెద్ద ఎత్తున మీడియా ముందుకు వచ్చి శోకణ్నాలు పెట్టా రు. అయితే, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడతాయని గుర్తించిన కేసీఆర్.. ముఖ్యంగా విపక్షాలకు ఇవి ఆయుధాలుగా మారతాయని గ్రహించిన ఆయన వాటిని చాలా వ్యూహాత్మ కంగా ఛేదించారు. ఇప్పుడు టీఆర్ ఎస్లో తమకు టికెట్లు లభించలేదనే అసమ్మతి దాదాపుగా సద్దుమణిగింది. 2, 3 స్థానాల్లో అసమ్మతి ఉన్న విషయం కేసీఆర్ దృష్టికి వచ్చింది. దీనిపై సంబంధిత మంత్రులు, అభ్యర్థులతో చర్చిస్తున్నారు.
పార్టీలో ఆశావహులు అనేక మంది ఉండడంతో తలెత్తిన ఈ వివాదాన్ని విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకునేం దుకు ప్రయత్నించాయి. పార్టీ విజయం కోసమే కృషి చేయాలనే పిలుపు సహా.. పార్టీ అధికారంలోకి వస్తే.. ఏదో ఒక పదవిని ఇచ్చే అవకాశం ఉంటుందనే ప్రకటనతో కేసీఆర్ ఆయా అల్లర్లను అణిచి వేశారు. దీంతో ఇప్పుడు దాదాపు నాయకులు అందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థుల ప్రచార సరళిని చూస్తోంటే.. వంద స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టిస్తామన్న ధీమా కేసీఆర్లో కనిపిస్తుండడం గమనార్హం. టీఆర్ఎస్ విజయం చారిత్రక అవసరమనే అభిప్రాయాన్ని ఆయన బలంగా తీసుకు వెళ్తున్నారు. ఎన్నికల గడువు సమీపిస్తున్నందున నాయకుల మధ్య సమన్వయం, ఓటర్లందరినీ కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ఇప్పుడు కలిసివస్తున్న ప్రధాన విషయం.
తెలంగాణ గురించి టీఆర్ఎస్కు ఉన్న పట్టింపు.. ఇతర పార్టీలకు ఉండదన్న అంశాన్ని ఓటర్లకు వివరంగా చెప్పేందుకు వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రచారంలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా అభ్యర్థులంతా పాల్గొనాలని ఆదేశించడం ద్వారా తాను ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టో కేసీఆర్ వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాల ఎత్తులకు కేసీఆర్ తనదైన శైలిలో చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ముందుగా పార్టీలో అసమ్మతి లేకుండా చేసుకోవడం, ప్రజలకు ఇవ్వబోయే హామీలపై స్పష్టత, ప్రజలతో మాట్లాడే విధానం ఇలా.. ప్రతి విషయంలోనూ కేసీఆర్ ముందు తన ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు. తర్వాత.. విపక్షాల వ్యూహాలపై విరుచుకుపడేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాలు రాజకీయంగా పార్టీని అధికారంలోకి తెస్తాయనే ప్రచారం ఊపందుకోవం గమనార్హం.