ఎన్నికల ఎఫెక్ట్ నేతలకు అప్పుడే ముచ్చెమటలు పట్టిస్తోంది. మరో ఆరు మాసాల గడువు ఉండగానే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ఇప్పుడు నాయకులు ఒక్కొక్కరుగా ప్రజల్లోకి వస్తున్నారు. నిజానికి నాలుగున్నరేళ్లుగా ప్రజ లకు అందుబాటులో లేని నాయకులు కూడా ఇప్పుడు ప్రజల మద్యకు వస్తున్నారు. వీరిలో ప్రధానంగా చర్చకు వస్తున్న పేరు గల్లా జయదేవ్. గుంటూరు ఎంపీగా 2014లో విజయం సాధించిన ఈయనకు బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. టీడీపీ తర ఫున గుంటూరు ఎంపీ టికెట్ సాధించిన గల్లా.. ఆయన బావమరిది, సూపర్ స్టార్ మహేష్ బలంతో గత ఎన్నికల్లో నెట్టుకొ చ్చారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు అంత ఈజీకాదని, ఆయన తన వ్యాపారాల్లోనే బిజీగా ఉంటున్నారని, చంద్రబాబుకు సర్వే రిపోర్ట్ అందింది. దీంతో ఆయన గల్లాను ఇటీవల అమరావతికి పిలిచి మరీ క్లాస్ పీకారు. ఈ నాలుగేళ్లలో ఒక్క ప్రత్యేక హోదా విషయంపై తప్ప నువ్వు పార్లమెంటులో గళం వినిపించింది లేదు. దీనిపై మన ఎంపీలు అందరూ కూడా మాట్లాడారు., అయితే, వారి కన్నా ఒక్క పావలా వంతు ఎక్కువగా నువ్వు మాట్లాడావే తప్ప .. నువ్వు ప్రత్యేకంగా సాధించిందిలేదు. కానీ, ప్రజల్లో మాత్రం నీపై వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీనికి నువ్వు ఏం చేస్తావో చెప్పు. ఎన్నికలకు రెండు నెలలకు ముందు నీ గ్రాఫ్ పూర్తిగా మారిపోవాలి. అని చంద్రబాబు దిశానిర్దేశం చేస్తూనే వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు.
నీ పనితీరు మారకపోతే నీ గెలుపు కష్టమే అని బాబు నేరుగా చెప్పడంతో ఉలిక్కిపడిన గల్లా వెంటనే అమెరికా ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం రెండు రోజులుగా ఆయన నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. రాష్ట్రాభివృద్ధి కొనసాగేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమంలో జయదేవ్ మాట్లాడుతూ... విభజన కారణంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఎంతో శ్రమిస్తున్నారన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీతో నాలుగేళ్లపాటు కలిసి నడిచినా మోసం చేశారే తప్ప సాయం చేయడంలో రాజకీయం చూపిస్తున్నారని ఆరోపించారు. విభజించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రంపై సహకారం అందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ మొండి చేయి చూపుతోందని, శ్రీకాకుళం తుఫాన్ బాధితులకు ఒక్క పైసా విదల్చలేదని విమర్శించారు. మొత్తానికి ఆయన వరుసగా రాబోయే రోజుల్లో గుంటూరులో పల్లె నిద్ర కార్యక్రమానికి సన్నాహాలు చేసుకోవడం చూస్తే.. ఎన్నికల ఎఫెక్ట్ ఆయనపై బాగానే పడినట్టు కనిపిస్తోంది.