ముందస్తు ముచ్చటకు తెరదీసిన తెలంగాణాలో.. కేసీఆర్ వ్యూహం అమలవుతుందా? ఆయన పెట్టుకున్న ఆశలు మళ్లీ సాకారం అవుతాయా? ఎన్నికల వేడి రాజుకుంటున్న క్రమంలో తెరమీదికి వస్తున్న ప్రధాన ప్రశలు ఇవి. మళ్లీ అధికారం తనకే దక్కాలని, వచ్చే ఎన్నికల్లో తనే అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న సీఎం కేసీఆర్ ఆశలు ఏమేరకు ఫలించనున్నాయి? ముఖ్యంగా ఆయన రాష్ట్రంలో రాజకీయాలు చేయడంతోపాటు.. అత్యంతకీలకమైన రెండు వర్గాలను తన పథకాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. వీటిలో ఒకటి రైతులు. రెండు పేద, మధ్యతరగతి ప్రజలు. కులాలకు, మతాలకు అతీతంగా ఈ ఇద్దరినీ ఆకట్టుకుంటే గెలుపు గుర్రం ఎక్కొచ్చన్నది కేసీఆర్ వ్యూహం. ఈ క్రమంలోనే ఆయన తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకోడానికి ముందు రెండు కీలకపథకాలను రాష్ట్రంలో అమలు చేశారు.
వీటిలో ప్రధానమైంది.. ప్రాజెక్టుల నిర్మాణం. దీని ద్వారా యావత్ రైతాంగానికీ తాను మేలు చేస్తున్నానని కేసీఆర్ చెప్పుకొన్నారు. ఇక, మరో కీలకమైన పథకం కంటి వెలుగు! పేద, మధ్యతరగతి వర్గాలే లక్ష్యంగా కేసీఆర్ దీనిని తెరమీదికి తెచ్చారు. ఒక ప్రాజెక్టుపై ఆర్నెల్లలో రాష్ట్రప్రభుత్వం చేసిన ఖర్చు రూ.9600 కోట్లు. సరాసరిన నెలకు రూ.1600 కోట్లు. ఇంత భారీ మొత్తం ఓ ప్రాజెక్టుపై ఖర్చుచేసిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చి నిర్మిస్తోన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆర్నెల్లలో చేసిన వ్యయం ఇది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని మళ్లించే పనులకు, విద్యుత్తు సరఫరా లైన్లు, సబ్స్టేషన్ల నిర్మాణం, 2018-19లో సాగునీటి రంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఇందులో పనుల కోసమే రూ.22,432 కోట్లు కేటాయించింది.
రూ.80,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2018 మార్చి నాటికి రూ.29 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఫలితంగా ఈ ప్రాజెక్టు ద్వారా రైతాంగాన్ని ఆకట్టుకోవాలని కేసీఆర్ భావించారు. అదేవిధంగా.. ఈ ఏడాది ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.106 కోట్లను మంజూరు చేసింది. ఇప్పుడు మరో 100 కోట్లు విడుదల చేయాలని భావిస్తున్నా.. కోడ్ అడ్డం వస్తోంది. అయితే, ఈ రెండు పథకాల ద్వారా కేసీఆర్కు వచ్చే మైలేజీ ఉంటుందా? అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు.
దీనిద్వారా వివిధ వర్గాల ప్రజలకు కంటి సమస్యలపై ప్రభుత్వం కేర్ తీసుకుందనే లక్షణాన్ని ఆయన ప్రజల్లోకి బాగానే తీసుకు వెళ్లారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశంలో ఏర్పాటైన మహాకూటమి ఈ రెండు పథకాలను ఓవర్ టేక్ చేసి కేసీఆర్ మైలేజ్ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కేసీఆర్కు ఈ పథకాలు ఎంత వరకు మేలు చేస్తాయన్నది ఆసక్తిగా మారింది. మరి చూడాలి ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ వ్యూహం ఏమేరకు ఫలించిందో!!