తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణం. ఈ ఎన్నికల వేళలో సర్వేల హేల కూడా ఘోష లాగా నింగి నంటి ప్రతిధ్వనిస్తుది. అయితే ముందస్తు తెలంగాణతో పాటు - రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల ఫలితాలను ఇండియా టుడే - పీఎస్ఈ తన సర్వే ద్వారా అంచనా వేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని తేల్చింది. అధికారంలోకి వచ్చేది కారు మాత్రమే నని తెలంగాణాలో గులాబీయే గుభాళిస్తుందని సర్వే అంచనా.
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారట. 34 శాతం మంది ప్రభుత్వం మారాలని భావిస్తున్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. 22 శాతం మంది తెలియదని సమాచారం యిచ్చారట.
కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆయన గెలుపుకు బోనస్ లా మారతాయని పేర్కొంది. దీనిని బట్టి 75శాతం మంది తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడే అవకాశం ఉందని ప్రముఖ సెఫాలజిస్టు రాజీవ్ కరాండికల్ (చెన్నై మేథమేటికల్ ఇన్స్-టిట్యూషన్) అంచనా వేసింది.
ఇక, మహాకూటమి విషయానికి వస్తే అనుకున్నస్థాయిలో ఫలితాలు అందుకునే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ ను ధారుణంగా దెబ్బతీస్తుందని పీఎస్ఈ నివేదికలో పేర్కొంది. మొత్తం 6977 మందిని టెలిఫోన్ ద్వారా ప్రశ్నించి సర్వేను అంచనా వేసినట్లు చెప్పింది.
ఇదిలా ఉండగా, మధ్య ప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం 52 శాతం మాత్రమే ఉందట. రాజస్థాన్ లో వసుంధరా రాజే అధికారం కోల్పోయేలా ఫలితాలు రాబోతున్నాయని పీఎస్ఈ నివేదికలో పేర్కొంది. ఛత్తీస్ గఢ్ లో బీజేపీ గెలుపునకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయట. అటు, ఏబీపీ-సీఎస్డీటీ సర్వే కూడా ఇదే ఫలితాలను రాబోతున్నాయని చెప్పడం గమనించదగ్గ విషయం. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే దేశవ్యాప్తంగా పోటీ ఉంటుందని, అయినా, బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నివేదికలో వెల్లడించింది.