రాష్ట్ర కాంగ్రెస్ న్యాయకత్వంపై రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ "క్యామ మల్లేష్" సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్లు అమ్ముకున్నారని పార్టీ పెద్దలపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ పెద్దల అవినీతి బాగోతానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ ఆడియో టేపులను విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇబ్రహీంపట్నం టికెట్ కావాలంటే 3 కోట్లు ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ డిమాండ్ చేశారని ఆరోపించారు. అలాగే టీఆర్ఎస్ నాయకుడు దానం నాగేందర్ తో కుమ్మకై 10 కోట్లు తీసుకొని ఆయనపై బలహీత నేత దాసోజు శ్రవణ్ను నిలబెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ ఛైర్మెన్ భక్తచరణ్ దాస్ టికెట్ల కేటాయింపులో డబ్బులు తీసుకొన్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆడియో టేప్ను విడుదల చేశారు. భక్తచరణ్ దాస్ కంటే ముందు నుండే తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తాను 34 ఏళ్ల నుండి కొనసాగుతున్నట్టు చెప్పారు. నాలాంటి నిజమైన నేతలకు అవకాశం యివ్వని ఉత్తమ్ కుమార్ రెడ్డికి, జానారెడ్డికి ప్రజలు బుద్ది చెప్పాలని ఆయన కోరారు.
"ఈ నెల 2న భక్తచరణ్దాస్ దగ్గరకు నా కుమారుడిని పంపిస్తే, ఇబ్రహీంపట్నం టికెట్ కావాలంటే 3 కోట్లు ఇవ్వాలని భక్తచరణ్ దాస్ కుమారుడు సాగర్ డిమాండ్ చేశారు. ఈ ఆడియోను రాష్ట్ర నాయకులందరికి చూపించాను. అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ లో చాలా మంది బ్రోకర్లు చేరారు. డబ్బులు తీసుకొని నాలాంటి నిజమైన నాయకులకు అన్యాయం చేస్తున్నారు. ఈ విషయాలు రాహుల్ గాంధీ దృష్టికి పోకుండా జాగ్రత్తపడుతున్నారు. బ్రోకర్లు అంతాకుమ్మకై అన్నాదమ్ముల కు, భార్యభర్తలకు టికెట్లు ఇప్పించు కుంటున్నారు. నేను అబద్ధం చెబితే నన్ను ఉరితీయండి. భక్త చరణ్ దాస్ కు, ఆయన్ని సమర్ధించే ఈ దొంగ నాయకులను సవాల్ చేస్తున్నా! దమ్ముంటే ఎవరినైనా నేను చెప్పేవి అబద్దాలు అని నిరూపించండి. ఇది నిజం కాకపోతే, నన్ను ఉరితీయండి. ఇలాంటి దొంగలు పార్టీ నుంచి వెళ్లిపోతేనే స్వచ్ఛమైన కాంగ్రెస్ బతుకుతుంది. ఈ బ్రోకర్ల వ్యవహారం రాహుల్ గాంధీ దృష్టికి పోవాలనే మీడియా ముందు ఆడియో టేపులు విడుదల చేశాను" అన్నారు.
"34ఏళ్లుగా కాంగ్రెస్లో ఉండి డబ్బు, ఆరోగ్యం పోగోట్టుకున్నాను. కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేసింది. ఇబ్రహీపట్నం కాంగ్రెస్ కార్తకర్తలు,తన అనుచరులతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా" అని మల్లేష్ తెలిపారు.
భక్తచరణ్ దాస్ తనయుడు తన కొడుకును టికెట్టు కోసం డబ్బులు అడిగిన విషయాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్కకు చెప్పానని, ఆడియో టేపును కూడ విన్పించినట్టు ఆయన చెప్పారు.అయితే ఈ విషయమై తర్వాత మాట్లాడుదామని కాంగ్రెస్ నేతలు తనకు చెప్పారన్నారు.