తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, టీడీపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా స్వర్గీయ నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి కేటాయించారు. తాజాగా కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నందమూరి సుహాసిని నెక్లస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. సుహాసినితో పాటు నందమూరి బాలకృష్ణ, చుండు శ్రీహరి, పలువురు కుటుంబసభ్యులు ఎన్టీఆర్కు నివాళలర్పించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..తన తండ్రిగారు స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ స్థాపించినపుడు మా సోదరుడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ వెన్నుదన్నుగా ఉన్నారని..తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన మెప్పు పొందారని అన్నారు. అంతే కాదు పార్టీ ప్రచారం..చైతన్య రథాన్ని నడుపుతూ ప్రజల్లోకి టీడీపీ పార్టీని తీసుకు పోయారు. ఆయన కూతురు నందమూరి సుహాసినికి కూకల్ పల్లి సీటు కేటాయించామని..తమ పార్టీ మొదటి నుంచి మహిళలకు గౌరవం ఇస్తూనే ఉందని..ఈ నేపథ్యంతో నందమూరి కుటుంబం నుంచి ఆడపడుచు వస్తుందని..అందరూ దివించాలని కోరారు.
ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు, హరికృష్ణ, బాలకృష్ణ ఆశీస్సులతో ప్రజాసేవ చేయడానికి ముందడుగు వేస్తున్నానన్నారు. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. కూకట్పల్లిలో తన గెలుపు ఖాయమని నందమూరి సుహాసిని ధీమా వ్యక్తం చేశారు. ఉదయం 11:21 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సుహాసిని నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో సుహాసిని బాబాయ్ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.