రాజకీయాల్లో వ్యూహాలు మీకే కాదు.. మాకూ ఉన్నాయంటూ.. అధికార టీడీపీ నేతలకు సవాల్ రువ్వుతున్నారు వైసీపీ నాయకులు. నిరంతరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోనే సరిపుచ్చకుండా.. వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడంపై వైసీపీ నాయకులు సిద్ధమ య్యారు. నియోజకవర్గంలో ఎంత పోటీ ఉన్నా.. గెలుపు ఏకపక్షం అయ్యేలా వారు తమ వ్యూహాలకు పదును పెంచుతున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం రూ.5 కే అందిస్తున్న భోజనాన్ని.. ప్రజలకు తమ తమ నియోజకవర్గాల్లో రూ.4 కే అందించే పథకాన్ని ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా అమలు చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం, చంద్రబాబు అన్న క్యాంటీన్లకు పునాది వేయకముందే.. ఓ సాధారణ పౌరుడిగా హైదరాబాద్లో అమలవుతున్న రూ.5 అన్నం పథకంపై ఆళ్ల ఆరాతీశారు.
తానే స్వయంగా లైన్లో నిలబడి రూ.5 చెల్లించి అన్నం భుజించారు. ఇదే పథకాన్ని తర్వాత కాలంలో ఆయన తన నియోజకవర్గంలో అమలు చేశారు. ప్రస్తుతం ఈపథకం విజయవంతంగా అమలవుతోంది. ఇక, ఇదే తరహాలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో తనకంటూ.. ఎవరూ పోటీ లేకుండా చేసుకోవడంలో ఆమె దూకుడు ప్రదర్శిస్తున్నారు. నిజానికి టీడీపీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు జీవించి ఉన్న సమయంలో ఆయన కొంత మేరకు రోజాకు పోటీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఆయన లేకపోవడం, ఆయన వారసులు ఇద్దరూ కూడా టికెట్ కోసం కుస్తీ పడుతుండడంతో ఇక్కడ రోజాకు పెద్దగా ఎదురు నిలిచే వారే లేకపోవడం గమనార్హం. అయినా కూడా రోజా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం చేరువ అవుతున్నారు.
నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రోజా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా కూడా యువతకు ఇచ్చిన హామీ మేరకు నగరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు జాబ్ మేళాలు నిర్వహించి వందల సంఖ్యలో యువతకు ఉపాధి కల్పించారు. అదేవిధంగా తాగునీరు కల్పన, రహదారుల ఏర్పాటుకు కృషి చేశారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉండడం, ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేసిన నేపథ్యంలో రాజాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకుండా పోయింది. అయినా కూడా మొక్కవోని ఆకాంక్షతో రోజా ప్రజల్లోనే తిరుగుతున్నారు. తాజాగా రోజా.. తన నియోజకవర్గంలోని పేదలకు పట్టెడు అన్నాన్ని అందించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వందలు , వేల కోట్ల ఆదాయం ఉన్న ప్రభుత్వమే రూ.5కు అన్నం పెడుతుంటే.. ఓ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. రూ.4కే పేదలకు అన్నం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తన పుట్టిన రోజు సందర్భంగా రోజా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు, నగరి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కూడా ఆమె ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక, ఓ ఎమ్మెల్యేగా తనపై అధికార పక్షం నాయకులు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న రోజా.. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో నగరి నియోజక వర్గానికి తాను ఏం చేసింది వివరిస్తూ.. ససాక్ష్యాలతో సహా.. ఓ మొబైల్ యాప్ను తీసుకువచ్చారు. తనపై విమర్శలు చేస్తున్న వారికి ఈ మొబైల్ యాప్ పాశుపతాస్త్రమని ఈ సందర్భంగా రోజా అభివర్ణించారు. వీటన్నింటికీ తోడు రోజా తన సొంత నివాసాన్ని నగరిలోనే ఏర్పాటు చేసుకోవడం మరింత కలిసి వస్తున్న అంశం. మొత్తంగా నగరిలో రోజా మరోసారి విజయం సాధించడం ఖాయమే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.