తెలంగాణలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో నిన్న నామినేషన్ల పర్వం ముగిసింది. ఎల్లుండి ఉపసంహరణ పూర్తయిన వెంటనే ఎవరి కోటా వారికి దక్కుతుంది. ఇక సీరియస్ గా ప్రచారాలు మొదలు పెట్టడమే తర్వాయి. కాకపోతే ఇప్పటికే టీఆర్ఎస్ ఎన్నికల జోరు కొనసాగిస్తుంది..టీఆర్ఎస్ అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. నిన్నటి వరకు టి కాంగ్రెస్, టిటీడిపి, టిజెఎస్,సీపీఐ మహాకూటమిగా ఏర్పడగా సీట్ల సర్ధుబాటులో గందరగోళం నెలకొంది.
మొత్తానికి అన్నీ పూర్తి చేసుకొని మహాకూటమి కూడా ప్రచారానికి సిద్దం అవుతుంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పెద్దలపై ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 23న ఎన్నికల ప్రచారానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇరువురు నేతలకు స్వాగతం పలుకుతూ టీపీసీసీ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ పోస్టర్ వల్లే వివాదం మొదలైంది.
ఈ పోస్టర్ లో టీపీసీసీ సీనియర్ నేతల ఫొటోలను మాత్రమే ఉంచారని..ఒక్క మహిళా నేత ఫోటో కూడా ఉంచలేదు..దాంతో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు టీఆర్ఎస్ ని విమర్శిస్తున్నామని..వారి పార్టీలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పే మనమే.. మన పోస్టర్ లో ఒక్క మహిళ ఫొటో కూడా ఉంచకపోవడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారని విమర్శించారు. ఈ సభలో కేవలం మగవాళ్లు మాత్రమే కాకుండా, మహిళలు కూడా పాల్గొంటారు కదా అని ప్రశ్నించారు.