ఎన్నికలు, రాజకీయాలు అంటేనే కులాలు, డబ్బుతో ముడిపడి ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు నుంచి గెలుపు వరకు అటు పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లు కులాలను ప్రాతిపాదికగా చేసుకునే నడుస్తుంటారన్న అంశంపై ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాలకు వీపరీతమైన ప్రాధాన్యం ఉంటుంది. గత నాలుగు దశాబ్దాల నుంచి ఇవి తెలుగు రాజకీయాల్లో బాగా పెనవేసుకుపోయాయి. ఇక గత ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయాక అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ కూడా ఈ కుల రాజకీయాల ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. వాస్తవంగా చూస్తే తెలంగాణ ప్రాంతం కన్నా ఏపీలోనే కులాల లెక్కలు, ఈక్వేషన్ల చర్చ ఎక్కువగా ఉంటుందన్న టాక్ ఉంది. అయితే 2014 తర్వాత తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ సైతం కుల రాజకీయాలకు బాగా ప్రాధాన్యం ఏర్పడింది.
తెలంగాణలో 2014 ఎన్నికల్లో గెలిచి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి వెలమ సామాజికవర్గానికి చెందిన కేసీఆర్ సీఎం అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వెలమలు రాజకీయంగా, ఆర్థికంగా బలపడ్డారన్న అభిప్రాయం ఉంది. ఇదే క్రమంలో సమైక్య రాష్ట్రంలోచాలా బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఐదేళ్ల టీఆర్ఎస్ పాలనలో కాస్త వెనకపడ్డారన్న అభిప్రాయమూ ఉంది. ఇదే ఇప్పుడు ఈ సామాజికవర్గంలో తీవ్రమైన కసికి కారణం అయ్యింది. కేసీఆర్ పాలన, వ్యక్తిగతంగా కొందరిని టార్గెట్ చేసిన విధానం తెలంగాణ రాజకీయ మేథావుల్లో సైతం చాలా మందికి నచ్చడం లేదు. వెలమల్లో మెజారిటీ వర్గం కేసీఆర్ వైపు ఉంటే రెడ్డి సామాజికవర్గం ఇప్పుడు కాంగ్రెస్ను భూజానికి ఎత్తుకుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో 30 నుంచి 35 నియోజకవర్గాల్లో సెటిలర్స్ ఓట్లతో పాటు కమ్మ సామాజికవర్గం ప్రాబల్యం కూడా అధికంగానే ఉంది.
కమ్మ సామాజికవర్గం గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఖమ్మం జిల్లా, నల్గొండ, నిజామబాద్ జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చూపనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం సామాజికవర్గం వెన్నుదన్నుగా నిలిచే తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఈ సామాజికవర్గానికి రాజకీయంగా కాస్త ప్రాధాన్యత తగ్గిందని చెప్పాలి. అదే టైమ్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల్లోకి జంప్ చెయ్యడంతో ఇక్కడ టీడీపీ పట్టు తగ్గింది. ఇదే టైమ్లో తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో ప్రభావితం చూపడంతో పాటు ఖమ్మం జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న ఈ సామాజికవర్గాన్ని పూర్తిగా తన వైపునకు తిప్పుకునేందుకు కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఈ సామాజికవర్గం నుంచి గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు చివరకు టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు.
కమ్మ సామాజికవర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ తన కేబినెట్లో బెర్త్ కూడా ఇచ్చారు. తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని ఢీ కొట్టాలంటే రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్న తమ కులమైన వెలమ కులంతో పాటు కమ్మ కులాన్ని కలుపుకుని ఆపరేషన్ వెల్కమ్ పేరుతో కేసీఆర్ కమ్మలను పూర్తిగా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. అయితే అదంతా గతం. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తాజా ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్పై అన్ని వర్గాలు గుర్రుగా ఉన్నాయి. కేసీఆర్ను ఎలాగైనా గద్ది దింపాలని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ మహజనసమితి మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఇదే క్రమంలో ఎవ్వరు ఊహించని విధంగా కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఈ రెండు పార్టీల కలయిక తెలంగాణలో బలమైన కూటమిగా మారింది. ఇదే టైమ్లో కేసీఆర్ను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న రెడ్డి సామాజికవర్గానికి ఇప్పుడు టీడీపీ తోడు అవ్వడంతో టీఆర్ఎస్కు చాలా చోట్ల ఎదురు ఈత తప్పడం లేదు.
కేసీఆర్ వెల్కమ్ ఆపరేషన్లో భాగంగా అధికారం ఉన్నప్పుడు బలంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్నా ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ కలవడంతో కమ్మ ప్లస్ రెడ్డి కాంబినేషన్ చాలా నియోజకవర్గాల్లో వర్కవుట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామబాద్ జిల్లాల్లో ఈ ప్లాన్ సక్సెస్ అయితే కూటమి మంచి ఫలితాలు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే అపర రాజకీయ చాణిక్యుడు అయిన కేసీఆర్ దీనిని ముందుగానే పసికట్టారు. ఈ క్రమంలోనే ఈ రెండు కులాలు కలిస్తే ఎక్కడ తనకు ఎఫెక్ట్ వస్తుందో అని సోమవారం ఖమ్మంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కులాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో కులం ముసుకులో వచ్చేవారికి ఇక్కడ ప్రజలు చెంప చెల్లుమనిపించి బుద్ధి చెప్పాలన్నారు. కులం ఆధారంగా ఓట్లు అడగడం పద్థతేనా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అంతటతో ఆగకుండా ఖమ్మంకు పెద్ద ప్రమాదం వస్తుందని సైతం చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలు బట్టీ చూస్తే ఖమ్మం జిల్లాలో సమస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీకి సీపీఐ, కాంగ్రెస్ కలవడంతో టీఆర్ఎస్ ఇక్కడ పెద్ద దెబ్బ తప్పదని ప్రాధమికంగా అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే క్రమంలో ఇక్కడ పాలేరులో పోటీ చేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ ఇప్పటికే ఏటికి ఎదురు ఈదుతున్నారు. కూటమి ఏర్పడక ముందు వరకు వీరి ఇద్దరి గెలుపు నల్లేరు మీద నడకే అనుకోగా ఎప్పుడైతే కూటమి ఏర్పడి కూటమి నుంచి బలమైన అభ్యర్థులుగా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, ఖమ్మంలో కందాళ ఉపేందర్ రెడ్డి పోటీలో ఉన్నారో అప్పుడే ఖమ్మం జిల్లాపై టీఆర్ఎస్ అధినేతకు టెన్షన్ స్టాట్ అయ్యింది. ఈ క్రమంలోనే ఖమ్మంలో జరిగిన ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కులాల వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పోటీ చేస్తోన్న సత్తుపల్లిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏదేమైనా తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలిసిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల ఓట్లు బదరాయింపు, కమ్మ, రెడ్డి కాంబినేషన్ వర్కవుట్ అయితే టీఆర్ఎస్ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదని ఆ యా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు చెమటోడ్చాల్సిందే అని గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.