నాడు ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా, నేడు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణాలో అందరిలోను ఆశక్తి వెల్లువెత్తేలా చేస్తుంది. కారణం నేటి కాంగ్రెస్ అభ్యర్ధి, ఒక నాటి టిడిపి ఫైర్-బ్రాండ్, తెలంగాణాలో ముఖ్యమంత్రి కుటుంబానికి పక్కలో బల్లెం అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్-టిడిపి స్నేహబంధానికి మార్గ నిర్దేశనం చేసిన అనుముల రేవంత్ రెడ్డి తో ప్రస్తుతానికి తెలంగాణా రాజకీయ సార్వభౌముడు కలవకుంట్ల చంద్రశేఖర రావు మద్దతుతో టిఆరెస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డితో నువ్వా? నేనా? అన్నంత స్థాయిలో బిగ్-ఫైట్ నెలకొంది.
కొడంగల్ నుండి మూడోసారి అనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.రెండు సార్లు ఈ కొడంగల్ స్థానం నుండి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా మూడోసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన బరిలోకి దిగుతున్నారు. తొలిసారిగా 2009 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఈ స్థానం నుండి పోటీ చేసి శాసనసభలోకి అడుగు పెట్టారు.
2014 శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి. గత ఏడాది చివర్లో రేవంత్ రెడ్డి తెలుగుదేశాన్ని వదిలి వేసి కెసిఆర్ ను ధీటుగా ఎదుర్కోవటానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలోనే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిడిపి అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇచ్చారు. కానీ ఆ రాజీనామా లేఖ ఆంధ్ర ప్రదేశ్ సభాపతి కార్యాలయానికి మాత్రం చేరలేదు. ఆ సమయంలోనే కొడంగల్ శాసనసభా స్థానానికి ఎన్నికలు జరుగుతాయని భావించారు.
అప్పుడు ఉపఎన్నికలు ఒకవేళ జరిగితే రేవంత్ రెడ్డిని ఓడించటానికి మంత్రి హరీష్రావు నాయకత్వంలో నలుగురు మంత్రులతో కూడిన బృందం కొడంగల్ లోనే మకాం వేసింది. అప్పుడే కొడంగల్ లో అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులను "ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం" ద్వారా టీఆర్ఎస్లోకి లాగేసుకున్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా స్పీకర్ కార్యాలయానికి చేరకపోవటంతో అది ఆమోదానికి నోచుకోక పోవటంతో ఉపఎన్నికలే జరగలేదు. ఇది చంద్రబాబు కుతంత్రం అంటారు కెసీఅర్. అయితే ముందస్తు ఎన్నికలకు తెరతీస్తూ తెలంగాణ శాసనసభను కేసీఆర్ రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొవటంతో కథ కోరుకున్నట్లు జరిగి పోయింది.
ఇప్పుడు రెండు కొదమ సింహాల మధ్య "కొడంగల్ బిగ్-ఫైట్ కు బరి" గా నిలిచింది. మూడవసారి ఇప్పుడు కొడంగల్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. . టీఆర్ఎస్ అభ్యర్ధిగా తెలంగాణా రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు, పట్నం నరేందర్ రెడ్డి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ స్థానం నుండి పలుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గుర్నాథరెడ్డి విజయం సాధించారు. కానీ 2009లో గుర్నాథరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గుర్నాథరెడ్డిపై ఘనవిజయం సాధించారు.
2014 ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి టీడీపీ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని కోరుకొన్నారు. కానీ, ఆనాడు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని చేమకూర మల్లారెడ్డికి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. మల్కాజిగిరి ఎంపీ స్థానం దక్కితే కొడంగల్ నుండి తన సోదరుడిని బరిలోకి దింపాలని రేవంత్ భావించారు. కానీ, నాటి పరిస్థితుల కారణంగా రేవంత్ రెడ్డి కొడంగల్ నుండే మరల బరిలోకి దిగాల్సి వచ్చింది. గత ఏడాది రాజకీయ పరిస్థితుల్లో మార్పుల కారణంగా రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కొడంగల్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా రేవంత్ పోటీలోకి దిగుతున్నారు.
శాసనసభ రద్దు చేయటానికి ముందే కొడంగల్ కు ఉపఎన్నికలు ఉంటాయన్న భావనతో అధికార టిఆరెస్ వారి బద్ధశత్రువు రేవంత్ రెడ్డి శాసనసభ లో అడుగుబెట్ట నీయ రాదని అంతులేనన్ని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు ఆ అభివృద్ధిని చూపుతూ కొడంగల్ లో ఎన్నికల రణక్షేత్రంలో తానూ ధీటుగా పాల్గొంటూ హోరెత్తిస్తుంది టీఆర్ఎస్.
ఇటీవలి కాలంలో మూడింతలు ఎక్కువగా నిధులు మంజూరు చేసి, పంచాయతీ రాజ్ రోడ్లకు ₹194 కోట్లు, ఆర్అండ్బీ రోడ్లకు ₹100 కోట్లు మంజూరు చేయగా పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కొడంగల్, కోస్గి, మద్దూరుల్లోని ప్రభుత్వాసుపత్రుల భవనాల నిర్మాణానికి ₹18 కోట్లు మంజూరయ్యాయి. కొడంగల్, కోస్గి మునిసిపాలిటీలకు ₹30 కోట్లు; కోస్గిలో బస్ డిపోకు ₹3 కోట్లు మంజూరు చేశారు.
రేవంత్ రెడ్డి గెయిల్ అందజేసిన ₹5 కోట్లతో కొడంగల్, కోస్గి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించారు. కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేశారు. ఆయన హయాం లోనే కోస్గికి బస్ డిపో మంజూరైంది. సొంత డబ్బులతో మూడెకరాలు కొనుగోలు చేసి ఆయన బస్ డిపో నిర్మాణం కోసం ఇచ్చారు.
రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, కృష్ణా రెడ్డి, రమేశ్ రెడ్డికి కొడంగల్ నియోజక వర్గంలోని మండలాల ప్రచార బాధ్యతలు అప్పగించారు. రేవంత్ రెడ్డి ఎక్కువగా తెలంగాణాలోని ఇతర నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
కొడంగల్ నియోజకవర్గం లో రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. కానీ, ఓటర్లు తక్కువగా ఉంటారు. మెజారిటీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.మరో వైపు టీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి విజయం కోసం మంత్రి హరీష్ రావు తన వ్యూహాలతో దగ్గర ఉండి మంత్రాంగం నడిపిస్తున్నారు. సోదరుడి కోసం మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడ కొడంగల్ పై శ్రద్ద పెంచారు.