ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజాకూటమి తరపున జోరుగా ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై కేసీఆర్, కేటీఆర్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు కూడా తన ప్రచారంలో కేసీఆర్, కేటీఆర్ లను తీవ్రంగా విమర్శిస్తుండటంతో వారు కూడా తగ్గట్టుగానే వాగ్బాణాలు వదులుతున్నారు.
ఐతే.. ఈ మాటల యుద్ధం ఇప్పుడు మరింతగా ముదురుతోంది. వ్యక్తిగత ఆరోపణల స్థాయికి వెళ్తోంది. తాజాగా కేటీఆర్ చంద్రబాబును ఓ కామెడీ యాక్టర్ గా వర్ణించారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయాలకు మారుపేరుగా కేటీఆర్ వర్ణించారు. అధికారం కోసం ఎలాంటి పనికైనా చంద్రబాబు వెనుకాడబోరని అన్నారు. చంద్రబాబు ప్రచారం వ్యర్థమని.. హైదరాబాద్ లో ఒక్క టీడీపీ అభ్యర్థి కూడా గెలవరని జోస్యం చెప్పారు.
అంతేకాదు.. ఇటీవల ఓచోట్ల ప్రచారం చేసిన కేటీఆర్.. చంద్రబాబు ఇటీవల విశాఖ పిచ్చాసుపత్రికి వెళ్లారంటూ ఓ పిట్ట కథ చెప్పారు. అక్కడ తాను హైదరాబాద్ కట్టానని.. చెప్పగా... ఓ పిచ్చివాడు.. మొదట్లో తానూ ఇలాగే చెప్పానని.. ఆ తర్వాత తనకు పిచ్చి నయమవుతోందని.. మీకు కూడా నయమవుతుంది ఏం ఫరవాలేదని చెప్పినట్టు కేటీఆర్ వ్యంగ్యబాణాలు విసిరారు.
సొంత రాష్ట్రం పరిస్థితి చక్కదిద్దుకోలేని చంద్రబాబు ఇక్కడ ప్రగల్బాలు పలుకుతున్నారని కేటీఆర్ అన్నారు. అమరావతి కట్టలేకపోయారని మండిపడుతూ.. ‘బాహుబలి, ‘2.0’ సినిమాలను తలదన్నే రీతిలో అద్భుతమైన గ్రాఫిక్స్ను చంద్రబాబు చూపిస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్లను, ఇంటర్నెట్ను తానే కనిపెట్టానని చంద్రబాబు చెప్పుకుంటారన్న కేటీఆర్... చివరకు చందమామకు కూడా తన పేరే పెట్టారని చెబుతారేమోనని సెటైర్లు పేల్చారు.