మరో మూడు రోజుల్లోనే తెలంగాణ ఎన్నికల పోలింగ్ ఉండటంతో నేతల ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రధాన పార్టీల అగ్రనేతలంతా ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి అస్త్రాలను బయటకు తీస్తున్నారు. ఇటీవల తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈసారి కేసీఆర్ గెలవకపోతే ఆయన బీజేపీ పంచన చేరుతారని అక్బరుద్దీన్ పాతబస్తీ ఎన్నికల ప్రచారంలో అన్నారు. అదే కాంగ్రెస్ గెలిస్తే మరో ఐదుళ్లు లేదా పదేళ్లు పాలిస్తుందని.. ఆ తర్వాతైనా బీజేపీ ప్రభుత్వమే తెలంగాణలో వస్తుందని అక్బరుద్దీన్ జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ రాకుండా చేసేందుకే తాము టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని ఓటర్లకు వివరించారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే మైనారిటీ సంక్షేమం ఉంటుందని వివరించారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ ను మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న ఎంఐఎం అవసరమైతే ఎన్నికల ఫలితాల తర్వాత చక్రం తిప్పాలని భావిస్తోంది. ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోతే తమ పార్టీ మద్దతు కీలకమవుతుందని.. అదృష్టం కలసి వస్తే సీఎం కుర్చీ అయినా దక్కవచ్చని ఇటీవల అక్బరుద్దీన్ ఓ సభలో అన్నారు కూడా. ఒకవేళ టీఆర్ఎస్ తమ మాట వినకపోతే.. ఎన్నికల తర్వాత తమ వ్యూహం తమకు ఉందని అక్బరుద్దీన్ అంటున్నారు.
పాతబస్తీలో ఎంఐఎం మొత్తం 7కు పైగా సీట్లలో గెలిచే అవకాశాలున్నాయి. ఆ పార్టీ రాజేంద్రనగర్ లో నూ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. 7-8 సీట్లు గెలిచే అవకాశం ఉన్న ఈ పార్టీ.. ఒక వేళ టీఆర్ఎస్ 50 సీట్లు మాత్రమే సాధించిన పక్షంలో ప్రభుత్వంలో చేరే అవకాశం కూడా ఉంది. మరి ఎంఐఎం నేతల సీఎం కుర్చీ ఆశలు ఏమేరకు నెరవేరతాయో చూడాలి.