కేసీఆర్ తో స్నేహం కోసం ప్రయత్నించి ఆయన తిరస్కారంతో మహాకూటమికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 15 స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం ఈ సారి తమను తగ్గించుకుని మరీ కాంగ్రెస్ కు స్నేహ హస్తం చాచింది. కేవలం 13 స్థానాల్లోనే పోటీ చేసేందుకు అంగీకరించింది. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పావులు కుదుపుతోంది.
మహా కూటమి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు స్వయంగా ప్రచారానికి దిగారు. ఖమ్మం జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో జోరుగా ప్రచారం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సంగతి ఎలా ఉన్నా ఖమ్మం జిల్లాలో మాత్రం ఆ పార్టీ మూడు వరకూ సీట్లు గెలుచుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ స్థానమైన సత్తుపల్లితో పాటు అశ్వరావుపేట, ఖమ్మం స్థానాల్లో ఆ పార్టీ జోరుమీద ఉంది.
సత్తుపల్లి, అశ్వరావుపేట సరిహద్దు నియోజకవర్గాలు కావడంతో అక్కడ టీడీపీ ప్రభావం ఎక్కువ. ప్రత్యేకించి సత్తుపల్లిలో టీడీపీ వరుసగా రెండు సార్లు గెలిచింది. సండ్ర వెంకటవీరయ్యకు స్థానిక ప్రజల్లో మంచి ఇమేజ్ ఉండటంతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి స్థానికుడు కాకపోవడం టీడీపీకి కలసివస్తోంది. అశ్వరావుపేటలోనూ టీడీపీ అభ్యర్థి మచ్చా నాగేశ్వరరావుకు గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఖమ్మంలో నామా నాగేశ్వరరావు గతంలో ఎంపీగా పనిచేయడం, గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడా కలసివస్తున్నాయి. ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్, టీడీపీ చేతులు కలపడం కూడా నామాకు కలసి వస్తోంది. సో.. తెలంగాణ అంతటా ఎలా ఉన్నా ఖమ్మం జిల్లాలో మాత్రం సత్తుపల్లి, అశ్వరావుపేట, ఖమ్మంల్లో టీడీపీ గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.