పంతాలు, పట్టింపులకు రాజకీయాల్లో తావు లేదు. నిన్నటి వరకు శత్రువులగా ఉన్న వారు సైతం రాజకీయ అవసరాల రీత్యా నేడు మిత్రులుగా మారుతున్నారు. అంతెందుకు 37 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ వైరాన్ని సైతం పక్కన పెట్టి కాంగ్రెస్-టీడీపీలు జట్టుకట్టాయంటే.. రాజకీయ మహిమ తప్ప మరొకటి లేదు. అలాంటి రాజకీయ వ్యవస్థలో ఎన్టీఆర్ వారసుడిగా.. తెరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. సినిమాల్లో బాగానే సక్సెస్ అవుతున్నా.. రాజకీయంగా మాత్రంఆయన అసలు సిసలు లాజిక్ మిస్సవుతున్నారనే వ్యాఖ్యలు అటు నందమూరి అభిమానుల్లోను, ఇటు టీడీపీ అభిమానుల్లోనూ జోరుగా వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. అన్నగారు ఎన్టీఆర్ తర్వాత అలాంటి కంచు కంఠంతో ప్రజలను పార్టీవైపు మళ్లించగల శక్తి చాలా కాలం తర్వాత కానీ, ప్రస్తుతం అధినేత చంద్రబాబుకు దక్కలేదు.
ఇప్పుడు చంద్రబాబు ప్రసంగాలకు ప్రజలు ఫిదా అవుతున్నారనే అనుకుందాం. మరి తర్వాత ఎవరు? ఇలా మాటల వ్యూహంతో ప్రజలను టీడీపీవైపు మళ్లించే శక్తి ఎవరికి ఉంది? అని ఆలోచన చేస్తే.. ప్రస్తుతం అటు నందమూరి ఫ్యామిలీ నుంచి ఫాంలో ఉన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఉందా? అంటే దాదాపు లేదనే అంటున్నారు టీడీపీ అభిమానులు. ఆయన మాట్లాడతారు.. కానీ, క్లారిటీ లేదు. అంతెందుకు ఆయనే పార్టీ అధ్యక్షుడు అంటే.. అంగీకరించే వారు కూడా లేరు. దీనికి ప్రధాన కారణం.. ఆయన నోటి దురుసు, చేతి వాటం. ఆయన ఎవరితోనూ కలివిడి గా మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. ఇక, మహిళల విషయంలోనూ బాలయ్య వారి మనసును చూరగొన్నది లేదు. సరే.. ఇక, మిగిలింది నారా లోకేష్. ఈయనకు టీడీపీలోని ఓ వింగ్ పప్పుగానే భావిస్తోంది.
ఆయనకు కూడా ప్రజలను ఆకట్టుకునేలా, వ్యూహాత్మకంగా వ్యంగ్యాస్త్రాలువిసురుతూ.. ఓ లక్షమంది ని తమ మాటలతో మెరిపించి మురిపించగల శక్తి కూడా లేదు. దీంతో రేపు ఒక వేళ.. ఏదైనా జరిగి.. టీడీపీ పగ్గాలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తే.. లోకేష్ కానీ, బాలయ్యకు కానీ ఇది శక్తికి మించిన పనే అవుతుంది. మరి ఇలాంటి తరుణంలో జూనియర్ ఒక్కరే ఆల్టర్నేట్గా కనిపిస్తున్నారనేది మెజారిటీ నేతల వాదన. దీనికి వారు చూపిస్తున్న ప్రధాన ఉదాహరణ 2009లో జూనియర్ నిర్వహించిన ఎన్నికల ప్రచారం. ఆ ప్రచారంలో ఆయన ప్రతి ఒక్కరినీ కట్టిపడేశారు. అయితే, ప్రభుత్వం అదికారంలోకి వచ్చిందా? రాలేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ఆల్టర్నేట్ అయితే లభించాడనేది సీనియర్ల వాదన. ఇక, ఎందుకో కానీ, అప్పటి నుంచి పార్టీకి దూరంగానే ఉంటున్నాడు జూనియర్.
కానీ, ఇప్పుడు అందివచ్చిన అవకాశం.. కూకట్పల్లి. ఇక్కడ నుంచి నందమూరి ఇంటి ఆడపడుచు సుహాసిని రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఇక్కడ పార్టీకి ప్రచారం చేసి..ఆమెను గెలిపించుకునే బాధ్యతను జూనియర్ తీసుకుంటే.. రాబోయే రోజుల్లోఆయనకు పార్టీ అండగా నిలవడంతోపాటు .. మళ్లీ ఎన్టీఆర్ దిగివచ్చాడా? అనే రేంజ్లో ఆయనకు రాజకీయ ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. కానీ, జూనియర్ ఇప్పుడున్న పరిస్థితిలో రాజకీయాలకు ముఖ్యంగా టీడీపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ లాజిక్ మిస్సవుతున్నాడని , ఇప్పటికైనా లాజికల్గా ఆలోచించి ప్రచారంలోకి దూకాలని కోరుతున్నారు నందమూరి అభిమానులు. మరి జూనియర్ ఏంచేస్తాడో చూడాలి.