ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మరో సంచలనానికి తెరలేపనున్నారు. మరో మూడు రోజుల్లో తెలంగాణలో పోలింగ్ ఉండగా.. ఈ రోజే తన సర్వే ఫలితాలను మీడియాకు వెల్లడించబోతున్నారు. సర్వేల విషయంలో లగడపాటి రాజగోపాల్ కు మంచి విశ్వసనీయత ఉండటంతో ఆయన సర్వేపై అంతటా ఆసక్తి నెలకొంది. గతంలో ఆయన చెప్పిన ఎన్నో సర్వేలు నిజమయ్యాయి.
తెలంగాణ ఎన్నికలపైనా లగడపాటి సర్వేలు చేయించారు. ఐతే.. సర్వే ఫలితాలను డిసెంబర్ 7 న పోలింగ్ సమయం ముగిసిన తర్వాతనే విడుదల చేస్తానని ఇటీవల ఆయన తిరుపతిలో తెలిపారు. కాకపోతే.. గెలిచే ఇండిపెండెంట్ల వివరాలు మాత్రం కొన్ని ప్రకటించారు. ఇందుకు ఎన్నికల కమిషన్ నిబంధనలు కూడా కారణం. ఎన్ని టీవీ ఛానళ్లు గుచ్చిగుచ్చి అడిగినా డిసెంబర్ 7నే తన సర్వే వివరాలు ప్రకటిస్తానన్నారు రాజగోపాల్.
ఐతే.. ఉన్నట్టుంది లగడపాటి రాజగోపాల్ తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. పోలింగ్ కు మూడు రోజుల ముందుగానే ఆయన తన సర్వే ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆయన ఇలా హఠాత్తుగా తన నిర్ణయం మార్చుకోవడం వెనుక చాలా రాజకీయాలే ఉన్నాయని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిన్న టీవీ9 సీపీఎస్ సర్వే పేరుతో హడావిడి చేయడం కూడా ఇందుకు ఓ కారణంగా చెబుతున్నారు.
టీవీ9 సర్వేతో టీఆర్ఎస్ కు లాభం చేకూరుతున్న సమయంలో దాన్ని అడ్డుకునేందుకు లగడపాటితో ముందుగానే సర్వే ఫలితాలు విడుదల చేయించేందుకు టీడీపీ వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సర్వేల్లో లగడపాటికి ఉన్న క్రెడిబులిటీని వాడుకుని.. తమకు అనుకూలంగా సర్వే ఫలితాలు ఇప్పించే ప్రయత్నం జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. లగడపాటి సర్వేలో మహాకూటమికి అనుకూలంగా ఫలితాలు వస్తే.. ఈ ఊహాగానాలకు బలం చేకూరే అవకాశం ఉంది. ఏదేమైనా లగడపాటి సర్వే కోసం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అభిమానులు ఎదురుచూస్తున్నారు.