ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభంజనం, పరవళ్ళు తొక్కుతూ జనసేన దూకుడు, తెలంగాణాలో అంతరించిపోతున్న తెలుగుదేశం, మెడకు చుట్టుకుంటున్న జగన్మోహనరెడ్దిపై హత్యాయత్నంకేసు, వేలకోట్ల ఆదాయపన్ను ఎగవేత కేసుల్లో అనుచరులు - కొండొకచో బినామీలు, మెడపై వేలాడే ఓటుకు నోటు, అనకొండలా విషం చిమ్మే పోలవరం, అమరావతి కేసులు, విశాఖ భూకబ్జా కేసులు ఇలాంటివి చెప్పుకుంటే చాంతాడంత అవినీతి, అక్రమార్జన, గుత్తేదార్ల కుంభకోణాల కేసులు కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేయటం - తను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేఖ శక్తులను దేశవ్యాప్తంగా ఏకీకృతం చేసి దేశానికి నాయకత్వం వహించాలి - వీటన్నిటికి తొలిమెట్టు తెలంగాణా లో విజయం — ఉపశమనం కావాలంటే ఇప్పుడు తెలంగాణాలో గెలుపు అనివార్యం టిడిపికి చంద్రబాబుకు.
అయితే అది సింగిల్ గా వస్తే చాలదు గుంపుగా రావాలి. ఇక స్నేహం చేసే పార్టీలు దేశం మొత్తంలో టిడిపికి ఎవరూ లేరు. మిగిలింది జన్మతః ఆగర్భశత్రువు కాంగ్రెస్ మాత్రమే. అసమర్ధ కాంగ్రెస్ ను బలోపేతం చేయటానికి జనం ఉన్నా ₹1200 కోట్ల నుంచి ₹5000 కోట్ల ఆర్ధికబలం సమకూర్చి దాన్ని బలోపేతం చేసి స్నెహం చేయవలసిన పరిస్థితుల్లోనైనా తెలంగాణా కోట చేజిక్కించుకోవటం తప్పని సరైంది నారా చంద్రబాబు నాయుడికి.
ఇక టిఆరెస్ చంద్రుని విషయం — మరోసారి అధికారం లోకి రావాలి, తన కొడుకు ముఖ్యమంత్రి కావాలి, తాను కేంద్రంలో ఫెడరల్ పాలనకు ద్వారాలు తెరిచి ప్రధాని కావాలి అందుకే ఇక్కడ గెలుపు అనివార్యం. అందుకే ఇద్దరు చంద్రుల సమరం తారస్థాయికి చేరింది.
చంద్రబాబు, మొదట తన ఆశాసౌధానికి తెలంగాణాలో ఒక అవకాశాన్ని చూశారు. ప్రజాకూటమి పొత్తు కుదిరితే టిడిపి ఉనికికి ఢోకా ఉండదు. టీడీపీ క్యాడరును కాపాడు కోవచ్చు. కొసరుగా తక్కువ సంఖ్యలోనైనా శాసనసభలో కొన్ని స్థానాలు వస్తే ప్రాతినిధ్యంతో ఏదో కొంత తెలంగాణాలో దూరి ఇంతింతై వటుడింతై అనేలా ఎదగవచ్చనేది సుదూర లక్ష్యం. కానీ ఓటమే సంప్రాప్తమైతే ఈ ఆలోచనే అత్యంత భయంకరంగా ఉంటుంది కారణం ఇక్కడ ప్రజాకూటమి అధికారంలోకి రాకపోతే, చంద్రబాబు భవిష్యత్తు వెంటనే నిర్ణయం చేసుకోవాల్సివస్తుంది. సారి నిర్ణయం దానికదే జరిగిపోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ టిడిపినేతల్లో అంతర్గత పోరు మొదలై ఫ్రోజురోజుకి పెరిగిపోతుంది.
అటు జగన్ అర్జునునిలా జనాస్త్ర ప్రయోగం చేయబోతున్నాదు. నాడు కౌరవులు సభ నుంచి పాండవులను తరిమివేస్తే అరణ్యాలపాలై అస్త్ర శస్త్ర సంపద సాధించుకొని వచ్చి చేసిన రణం లాగానే జగన్ జానారణ్యలోకి వెళ్ళిపోయి జనాభిమానాస్త్ర శస్త్రాలను కావలసినదానికంటే ఎక్కువే సాధించుకున్నారు. ఇక బాబు పై కురుక్షేత్రమే మిగిలింది. ఒకనాటి స్నేహితుడు జనసేన పవన్ కళ్యాన్ కత్తులు నూరుతూ కరవాలాలు దూస్తూ దూసుకువస్తున్నాడు.
పైగా సిట్టింగులను మారుస్తారని గట్టిగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విపరీతంగా వలసలు పెరుగుతాయి. అవినీతి ఆరోపణలు ఇంకా పెరుగుతాయి. ఏపీ క్యాడర్ మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. బాబుపై పార్టీలో గౌరవం తగ్గుతుంది. ఇక జాతీయ స్థాయిలో దాని ప్రభావం ఇంకా ఘోరంగా ఉంటుంది. నేనే చేశాను, నేనే చేస్తాను, నేను తప్ప వెరెవరూ చేయలేరు అని జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రక్రియతో దేశ దిమ్మరి గా మారటం, రాష్ట్రం వదిలేసి తిరుగుతున్న చంద్రబాబు ను రాష్ట్రమే కాదు కార్యకర్తలు కూడా ఇపుడే సరిగా పట్టించుకోవడం లేదు. ఇక్కడ గెలవకపోతే ప్రజలంతా శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు వల్ల ఉపయోగం శూన్యం అని భావించే పరిస్థితి రాబోతోంది. ఇవన్నీ ప్రజలపై ప్రభావం చూపి ఓటింగ్ సరళిని గణనీయంగా తగ్గించివేస్తాయి. అందుకే ప్రజాకూటమి వైఫల్యమైతే చంద్రబాబు భవిష్యత్తు విషాదమే.
చంద్రశేఖరరావుకు ఇపుడు పొత్తుల అవసరం లేదనుకొన్నారు. తెలంగాణలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలోనే కాదు ప్రపంచములోను ఎక్కడాలేవు. కాబట్టి తెలంగాణా ప్రజలు ఓట్లువేయకుండా ఉండరని అతిశయం, ఆయనను ముందస్తు ఎన్నికలకు పురిగొలిపింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయనకు కొనుక్కున్న తలనొప్పి గా మారింది.
అసలే గతంలో ఇచ్చిన వరాలే భారంకాగా కొత్తఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు, దానికి సమయానుకూలంగా జత చేసిన హామీలు ఇప్పుడు పెనుభారమై కూర్చు న్నాయి. అయినా కూడా వీటితో తనను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అని కేసీఆర్ భావించారు. అందుకే నో పొత్తులు అనేశారు. గెలిస్తే ఓకే తిరుగులేదు-ఒక వేళ ఓడితే, ఆయనకు తొలి శత్రువు పచ్చ మీడియా అవుతుంది. ఎందుకంటే, తాను ప్రజలుకోసం బతుకుతున్నాను. ఎవరినీ ఖాతరు చేయాల్సిన అవసరంలేదని గతంలో మీడియాను పట్టించుకోలేదు పైగా అణచివేశారు, అదీ ధారుణంగా. నాడు మీడియాకు వేసిన కౌంటర్లు కాలనాగులై వాటి మూసుకున్న నోళ్లు కాల నాగులై విషం చిమ్మటం జరగవచ్చు. అలా జరిగితే ..ఆ ఊహే ఊహాతీతం.
ఇక కాంగ్రెస్ నేతల కేసీఆర్ పై ఆగ్రహం చెలియలికట్టదాటి, వరద గోదారి అయి ఉక్కిరి బిక్కిరి ఐతే మాత్రం, ఆ పరిస్థితి ఊహకు అందదు. తమకు ఉనికి లేకుండా చేసే ప్రయత్నం చేశాడని కోపంతో వారు ఊగిపోవటం మనకందరికీ తెలుసు. కేసీఆర్ అవినీతి తగ్గించాడు అని స్వల్ప అల్ప ఆదాయవర్గాల ప్రజల్లోఉన్న సానుకూల అభిప్రాయం, అవినీతి బాగా అలవాటు పడిన చోటా మోటా గల్లి లీడర్ల లో కేసీఆర్ మీద అంతులేనంత కోపం ఉంది. వారు కూడా మెల్లగా కాంగ్రెస్ లోకి వలసల వెల్లువ లాగా మారే అవకాశాలున్నాయి.
ఇక ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలను కూడా బాగా ప్రభావితం చేస్తాయన్నది యధార్ధం. వీటన్నింటి వల్ల పార్టీ నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే, ఇద్దరు చంద్రులకు ఈ ఎన్నికలు ప్రాణసంకటమే. మిగతా పార్టీలకు ఓటమి వచ్చినా పెద్దగా పోయేది గాని వచ్చేది గాని లేదు. నచ్చితే పార్టీలో ఉంటారు, లేకపోతే అధికార పార్టీలోకి జంపవుతారు. ముఖ్యంగా కాంగ్రెస్ కూడా పోయేది ఏమీ లేదు. కారణం ఖర్చంతా నారా చంద్రబాబుదే అని ప్రచారం ప్రబలంగా ఉంది. ఒకవేళ మాహాకూటమి ఓడిపోతే నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి తేలుకుట్టిన దొంగ సామెతలాగా కనిపిస్తుంది.