తెలంగాణలో శుక్రవారం సాయంత్రానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాధారణంగా పోలింగ్ శాతాలు రాత్రి కల్లా తెలిసిపోతాయి. అలాగే శుక్రవారం అర్థరాత్రి వరకూ పోలింగ్ శాతం 69.1 గా వచ్చింది. దాదాపు అన్ని పత్రికలూ ఇదే సమాచారం అందించాయి. అయితే వాస్తవంగా ఎంత పోలింగ్ అయ్యిది మాత్రం ఇంకా తేలలేదు.
పోలింగ్ ముగిసి 26 గంటలు దాటుతున్నా.. ఇంకా ఈసీ అధికారులు పోలింగ్ శాతం పై లెక్కలు వేస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. ఈసారి ఇంకా అత్యాధునిక టెక్నాలజీ వాడామని కూడా ఈసీ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు లైవ్ లో పర్సంటేజ్ చూపిస్తామని అమ్రపాళి వంటి అధికారులు మీడియాకు తెలిపారు.
కానీ.. శనివారం రాత్రి 7 గంటలు దాటే వరకూ కూడా ఈసీ పోలింగ్ శాతాన్ని ఈసీ వెల్లడించలేకపోయింది. అసలే ఎన్నికల నిర్వహణలో ఈసీ సమర్థంగా వ్యవహరించలేకపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఓట్ల గల్లంతు విషయంలో ఈ తప్పిదాన్ని ప్రధానాధికారి రజత్ కుమార్ కూడా అంగీకరించారు. మరోవైపు పోలింగ్ శాతం 75 వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదే జరిగితే గతంతో పోలిస్తే 8 శాతం వరకూ పోలింగ్ పెరిగినట్టు తెలుస్తోంది. మరి ఈ పెరిగిన పోలింగ్ ఎవరి విజయావకాశాలను దెబ్బ తీస్తుందనేది విశ్లేషకుల మెదడుకు పదును పెడుతోంది. దీన్ని ఎవరికి వారు తమ గెలుపుకు కారణమవుతుందని విశ్లేషించుకుంటున్నారు.