రుణాల ఎగవేత ఆరోపణలతో విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారవేత్త విజయ్ మాల్యా, స్వదేశంలో కోర్టుల విచారణను ఎదుర్కొనేందుకు భారత్కు తిరిగి రావాలని భావిస్తున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. కాగా, భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి, విదేశాలకు చెక్కేసిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాను ఇండియాకు తిరిగి పంపే విషయంలో బ్రిటన్ కోర్టు నేడు తీర్పును వెలువరించే అవకాశాలున్నాయి.
మూత బడిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు సుమారు రూ. 9,000 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో మాల్యా సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ల విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బ్రిటన్లో ఆయన తల దాచుకున్నారు. ఈ ఆర్డినెన్స్కు అనుగుణంగా భారతదేశంతోపాటు విదేశాల్లో ఉన్న మాల్య ఆస్తులను జప్తు చేసుకునేందుకు అనుమతించాలని దర్యాప్తు సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి.
ఆయన్ను భారత్ కు అప్పగించాలని కోరుతూ సీబీఐ, ఈడీ అధికారులు లండన్ లోని వెస్ట్ మినిస్టెర్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా, విచారణ జరిగింది. నేటి తీర్పు మాల్యాకు వ్యతిరేకంగా వస్తే, ఆయన్ను లండన్ నుంచి ఇండియాకు తీసుకువచ్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, మాల్యా సైతం వెస్ట్ మినిస్టర్ కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే, వెంటనే హైకోర్టులో అప్పీలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కోర్టు తీర్పు భారత్ కు అనుకూలంగా వస్తే, బ్రిటన్ హోమ్ మంత్రి మాల్యా అప్పగింతపై తుది నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది.