అటు తెలంగాణాలో ఎన్నికలు ముగిశాయి. ఇక, ఏపీలో మిగిలాయి. ప్రస్తుతం తెలంగాణా ఎన్నికల ఫలితం కోసం రెండు రాష్టాల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. అక్కడి ఫలితం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందని మేధావులు సైతం చెబుతున్నారు ఇక, రాజకీయ పార్టీలు కూడా ఇదే తీరుగా ఎదురు చూస్తున్నాయి. అయితే, తెలంగాణా ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా. . ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే.. ప్రజానాడిని పట్టుకోవడంలో పార్టీలు అన్నీ కూడా విఫలమయ్యాయయనేది స్పష్టంగా తెలుస్తున్న విషయం. ప్రజలంతా తమ వెంటేనని చెప్పుకొంటున్న పార్టీలకు ఎన్నికల అనంతరం మాత్రం ఈ మాటలను చెప్పలేక పోతున్నాయి.
ముఖ్యంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మంలోను, ఇటు గ్రేటర్ హైదరాబాద్లోనూ సుడిగాలి పర్యటన చేశారు. కేసీఆర్పై యుద్ధం ప్రకటించారు. గ్రేటర్లో జరిగిన సభలో ``యువ్ మిస్ యూ సీఎం సార్`` అనే స్లోగన్లు ఉన్న బోర్డులను చూసిన టీడీపీ నాయకులు భారీ ఎత్తున టీడీపీకి జనాలు మద్దతిస్తున్నారని, గెలుపు ఖాయమని అనుకున్నారు. ఇక, తెలంగాణా సారధి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాల్గొన్న సభల్లోనూ ఇంతకు మించిన రెస్పాన్స్ వచ్చింది. కార్యకర్తలు కోలాహలంగా ఆయా సభలను విజయవంతం చేశారు. తీరా ఎన్నికల విషయాన్ని చూస్తే... సభల్లో ఉన్న హడావుడి ఎన్నికల విషయంలో కనిపించలేదు.
దీంతో ఏ పార్టీ కూడా ఇతమిత్థంగా తాము గెలుస్తామని చెప్పలేని పరిస్తితి ! దీనిని బట్టి.. ప్రజానాడిని అందిపుచ్చు కోవడం లో పార్టీలు విఫలమయ్యాయనే విశ్లేషణలకు ఊపు వచ్చింది. ప్రభుత్వ పథకాలు ఉపశమనం కలిగిస్తాయని టీఆర్ ఎస్ అదినేత భావించినా, దాని తాలూకు ఫలితం ఎక్కడ కనిపిస్తోందో చెప్పలేని సందిగ్థ వాతావరణం రాజ్యమేలుతోంది. ఇక, ఏపీ విషయానికి వస్తే.. చంద్రబాబు కూడా తిరిగి ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి నినాదంతో ముందుకు సాగారు. అయితే, ఇప్పుడు తెలంగాణా ఎన్నికల సరళిని చూశాక.. ఏపీలోనూ పథకాలు ఓట్లు రాల్చుతాయా ? అనేసందేహం స్పష్టంగా కనిపిస్తోది. ప్రజలు ఏం కోరుతున్నారు? వారి ఆకాంక్షలు ఏంటి అనే విషయాలపై ఇప్పుడు నాయకులు దృష్టి పెట్టారు. మరి ప్రజల నాడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారా? లేదు ఏం జరిగితే అదే జరుగుతుంది..! అని చూస్తూ ఊరుకుంటారా చూడాలి!