ముందస్తు ముచ్చటకు తెరదీసిన తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇక్కడ నుంచి చక్రం తిప్పాలని భావించిన ఏపీ సీఎం టీడీపీ అధినేత కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడు.. తహతహ లాడిపోయారు. ఈ క్రమంలోనే ఎన్నడూ లేని విదంగా రెడ్డి సామాజిక వర్గంతో జట్టుకట్టారు. అయితే, తాజా పరిణామాల ను గమనిస్తే.. తెలంగాణాలో వచ్చిన ఎన్నికల ఫలితం .. చంద్రబాబుకు చెంపపెట్టుగా మారిపోయింది. ఇక్కడ బలమైన నాయకుడిగా ఉన్న కేసీఆర్ వ్యూహం సహా ఆయనకే ఇక్కడి ప్రజలు జైకొట్టారు. బలమైన ఉద్యమ నాయకుడైన కేసీఆర్ను ఢీకొట్టడంలో అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ సహా మహాకూటమి నాయకులు పూర్తిగా విఫలమయ్యారు.
ప్రధానంగా తెలంగాణా ప్రజలను సామాజిక వర్గాల వారీగా విడదీసి విజయం సాధించాలని మహాకూటమి తరపు న కమ్మ-రెడ్డి సామాజిక వర్గం తీవ్రస్థాయిలో ప్రయత్నించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. అయితేఈ ఫార్ములా మాత్రం ఎన్నికల్లో ప్రజలు హర్షించలేదు. గతంలో ఉన్న పరిస్థితిని చూస్తే.. రెడ్డి వర్గం అంతా కూడా కాంగ్రెస్ కు అండగా ఉంటే.. కమ్మ వర్గం మొత్తం టీడీపీకి బలమైన వర్గంగా మారింది. అయితే, ఎట్టి పరిస్థితిలోనూ కేసీఆర్ను గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్+టీడీపీలు కలిసి ప్రచారం చేసినా.. ఫలితం మాత్రం దక్కలేదు.
దీంతో. తెలంగాణాలో ఫలితం అధికార పార్టీ నేతలు ఊహించినట్టుగానే వచ్చింది. ప్రధానంగా పలు కీలక నియోజకవ ర్గాల్లో టీడీపీ నిలబెట్టిన నాయకులు మట్టి కరిచారు. అంతేకాదు, కాంగ్రెస్కు ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా గల్లంతైందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అంటే.. దీనికి కూడా రెడ్డి వర్గం వెళ్లి కమ్మ వర్గంతో చేతులు కలపడమే కారణంగా కనిపిస్తోంది. దీంతో ఎక్కడైనా ఎలాంటి వేషాలైనా వేయొచ్చుకానీ, ప్రజలతోనూ, ఎన్నికల్లోనూ వేయకూడదనే విషయం నాయకులకు ఇప్పుడు స్పష్టంగా తెలిసి వచ్చిందని చెప్పక తప్పదు. ఏదేమైనా.. ప్రజల్లో బలంగా ముద్ర వేసుకున్న నాయకుడు మహాకూటమికి లేకపోవడం మనకు స్పష్టంగా కనిపిస్తోంది.