తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో ఐదేళ్లు ఎదురు లేదు. అంచనాలకు మించి, ఎవ్వరూ ఊహించని విధంగా భారీ మెజారిటీతో తెలంగాణలో టీఆర్ఎస్ వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్లో గత మూడు,నాలుగేళ్లుగా అందరూ ఊహిస్తున్న విధంగానే పరిణామాలు జరుగుతున్నాయి. కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలను ఆయన తన తనయుడు కేటీఆర్కి అప్పగిస్తారని... తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి భావి సీఎం కేటీఆర్ అనే వార్తలు కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను కేటీఆర్ ఎప్పటికప్పుడు కండిస్తూ వస్తున్నా తాజాగా జరిగిన పరిణామాలతో పార్టీ పరంగా కేసీఆర్ వారసుడు కేటీఆరే అని.... కేసీఆర్ తర్వాత సీఎం పగ్గాలు చేపట్టేది కేటీఆరే అని క్లియర్కట్గా తెలుస్తోంది.
టీఆర్ఎస్ వర్కింగ్ కమిటి ప్రెసిడెంట్గా కేటీఆర్ను నియమించడంతో భవిష్యత్తులో సీఎంగా కేటీఆర్కు పట్టాభిషేకం చేసేందుకు కేసీఆర్ లైన్ క్లియర్ చేస్తున్నట్టే తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా కేసీఆర్ చెప్పారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే క్రమంలో ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారితోనే కేబినెట్ కూర్పు ఉంటుందని కూడా తెలుస్తోంది. కేటీఆర్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన టీమ్తోనే కేబినెట్ మంత్రులను ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతోంది. అలాగే కేటీఆర్కు సన్నిహితంగా ఉన్న వాళ్లు, సీనియర్లను వచ్చే ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయించాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొంత మంది సీనియర్లు, మంత్రులు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన్ను మంత్రిగా తీసుకోకుండా వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి లోక్సభ బరిలో దింపాలని కేసీఆర్ ప్లాన్. ఇప్పుడు ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందట. అయితే పొంగులేటికి మంత్రి పదవి ఇప్పుడు ఇస్తారా లోక్సభ ఎన్నికల తర్వాత ఇస్తారా ? అన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఇక ఖమ్మం నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్కు డిఫ్యూటి స్పీకర్ పదవి ఇస్తారని తెలుస్తోంది. అలాగే వరంగల్ జిల్లా నుంచి మొన్నటి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం శ్రీహరిని ఈ సారి వరంగల్ నుంచి లోక్సభకు పోటీ చేయించి కేటీఆర్కు సన్నిహితంగా ఉండే వినయ్భాస్కర్ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారట.
అలాగే తాండూరులో ఓడిపోయిన మాజీ మంత్రి పట్నం మహింధర్ రెడ్డిని చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేయించి మహేందర్ రెడ్డి తమ్ముడు, రేవంత్ రెడ్డిని ఓడించిన నరేందర్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోనున్నట్టు టాక్. ఇటీవల పార్టీ మారిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరరెడ్డిని ఢీ కొట్టేందుకు మహేందర్ రెడ్డి అయితేనే కరెక్ట్ అని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక కేటీఆర్ తన టీమ్తో దూసుకుపోవాలంటే సీనియర్ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్న క్రమంలోనే స్టేట్లో టోటల్గా కేటీఆర్ టీమ్ను పెట్టి తన టీమ్తో కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొన్న ఎన్నికల్లో ఓడిన మంత్రులను, సీనియర్లను వచ్చే ఎన్నికల్లో లోక్సభ బరిలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.