జ్యోతిరాదిత్య సింధియా — సచిన్ పైలట్, ఈ యువనాయకుల ఐదేళ్ల
నిర్విరామ కృషి బూడిదలో పోసిన పన్నీరే! ఇలా జరగటానికి కారణం కాంగ్రెస్ యువ అధినేత
రాహుల్ గాంధి నిర్ణయ రాహిత్యం సమయస్పూర్తి లేమి, పార్టీపై పట్టు, నియంత్రణ
సాధించలేనితనం ప్రధాన కారణాలు కావా! ఇదే
రాహుల్ తీరైతే ఇంత సువిశాల భారత్ ను ఎలా నిర్దేసించ గలరు? నియంత్రించ గలరు?
ఇద్దరి మకుటం లేని యువ సమర్ధతలను బూడిదలో పోసేసినందుకు దానికి నష్టపోయేది జాతి కదా! తనలో లేని నాయకత్వపటిమను తనసహచరుల్లోనైనా ఉండేలా చూసుకొనే అవకాశాన్ని వినియోగించు కొని ఉండి ఉంటే రాహుల్ లోని మానేజ్మెంట్ నైపుణ్యాన్నైనా జనం వేనోళ్ళా కొనియాడేవారు. కాని ఆ సృజనాత్మక అవకాశాన్ని రాహుల్ చేజేతులా జారవిడుచు కున్నారు. ఇదీ రాహుల్ తీరు.
మద్య ప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా - రాజస్థాన్ లో సచిన్ పైలట్ - ఇద్దరూ ఎంతగా కష్టపడ్డా ఫలితం మాత్రం వారికి దక్కలేదు. ఇది వారిలోని ఉత్సాహాన్ని నిలువునా కూల్చేసింది. అదీ తన తండ్రి మాధవ రావు సింధియా లాగే తొలినుంచి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం చెమటోడ్చారు. అలాగే సచిన్ పైలెట్ కూడా తన తండ్రి రాజేష్ పైలెట్ లాగే తొలినుంచి తన సర్వస్వాన్ని కాంగ్రెస్ అధివృద్దికే దారపోశారు.
జ్యోతిరాదిత్య సింధియా
జ్యోతిరాదిత్య సర్వం తానే అయి రాష్ట్రమంతటా పర్యటించారు. ఆ పర్యటనను అవకాశంగా మార్చుకొని ఒకవైపు
యువతను మరోవైపు అనుభవఙ్జులతో చర్చించి రాష్ట్రా న్ని అందులోని సమస్త పరిస్థితులను
అవగాహనతో కాచి ఒడపోశారు.
గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన ఈ యువనేత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైనా ఫలితం దక్కలేదు. జ్యోతిరాదిత్య సింధియాకు పదవి దక్కకపోవడానికి అనేక కారణాలుండొచ్చు.
*అనుభవఙ్జునికే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలన్న నిర్ణయం ప్రభావం చూపితే, మరొక బలమైన కారణం సింధియాకు సీఎం పదవిని దూరం చేసిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
*ప్రధానకారణం జ్యోతిరాధిత్యకున్న వంశపారంపర్య చరిత్ర వల్ల నెహౄ కుటుంబానికున్న విశ్వాస రాహిత్యం ఒక కారణం కావచ్చు అనేది కొందరు విశ్లేషకుల భావన.
మధ్యప్రదేశ్ లో తొలినుంచి జ్యోతిరాదిత్య సింధియా కష్టపడుతున్నారు. సీనియర్ల పైన నమ్మకం లేక రాహుల్ గాంధీ ఆయనను పార్టీని బలోపేతం చేయాల్సిందిగా సూచించారు. గత ఐదేళ్ల నుంచి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ ను వదలకుండా తిరుగుతున్నారు. రాహుల్ అప్పగించిన మిషన్ ను పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారు.
అయితే పదిహేను సంవత్సరాలుగా అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కొంత అసంతృప్తి ఉందని గ్రహించిన సీనియర్ నేతలు మధ్యప్రదేశ్ పై కన్నేశారు. అందులో ప్రధానమైన వ్యక్తి రాజకీయ దురంధరుడు వ్యూహనిపుణుడు దిగ్విజయ్ సింగ్, గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీపై అసంతృప్తి ఉందని తెలియడంతో “డిగ్గీరాజా” ఏత్తుకు పై యెత్తులు వేస్తూ వ్యూహాలు పన్నుతూ రాజకీయ కుతంత్రాలతో రంగంలోకి దిగారు. అద్భుత వ్యూహంతో మూడువేల కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వకున్నా ఆయన తన సొంత ఖర్చుతోనే పాదయాత్ర చేశారు. ఇంత వృద్ధాప్యంలో కూడా మళ్లీ ఆయనకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక ఆయనను అన్ని వేల కిలోమీటర్లు నడిపించింది.
ఈ పరిస్థితుల్లోనే జ్యోతిరాదిత్యకు, దిగ్విజయ్ ల మధ్య కోల్డ్-వార్ బుసలు కొట్టింది ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ డిగ్గీని ఒకరకంగా పక్కన పెట్టారనే చెప్పాలి. ఇంతజేసినా పరిస్థితులు తనకు అనుకూలించక పోవటం, ఎలాంటి పరిస్థితుల్లో అవకాశం దక్కదని రూఢీ చేసుకున్న డిగ్గీరాజా, తన స్నేహితుడైన కమలనాధ్ పేరును ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించారు. కమలనాధ్ నాటి భారత ప్రధాని ఇందిరా గాంధికి ఆమె చిన్నతనయుడు సంజయ్ గాంధికి ఎమెర్జెన్సీ కాలంలో అత్యంత విశ్వాసపాత్రుడుగా పనిచేసి ఆ తరవాత అలాగే కొనసాగుతూ వస్తున్నారు. సింధియాకు సీఎం పదవి దక్కితే తనకు నిలువనీడ కూడా ఉండదని భావించి డిగ్గీరాజా లోలోపల మంత్రాంగం నడిపి కమలనాధ్ కు సీఎం పదవి దక్కేలా చక్రం తిప్పారు.
రాజస్థాన్ లో మాదిరిగానే ఇక్కడ కూడా సింధియాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నా ఆయన సున్నితంగా తిరస్కరించారు. పాపం ఇన్నేళ్లు కష్టపడినా చివరకు పెద్దోళ్లే పదవిని తన్నుకుపోయారు. పాపం! సింధియా! ఇలా జ్యోతిరాధిత్యునికి (సూర్యునికి) రాహువులా గ్రహణం పట్టించిన ఘనుడు, ఆధునిక రాహువుగా నిలిచి పోయాడు డిగ్గీరాజ.
రాజస్థాన్ తో పోలిస్తే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమలనాథ్ను ఖరారు చేయడం చాలా సులువు. అయినా ఆయన పేరును ఖరారుచేయడానికి రాహుల్ గాంధీ మూడు రోజుల సమయం తీసుకున్నారు.
సచిన్ పైలట్
రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి సచిన్ పైలట్ వైపు ముందు నుంచి మొగ్గుచూపిన రాహుల్ గాంధీ పార్టీ పెద్దల సలహా మేరకు అశోక్ గెహ్లాట్ ను అంగీకరించక తప్ప లేదని, సచిన్ పైలట్ ను డిప్యూటీ గా ఒప్పించినప్పటికీ, అశోక్ గెహ్లాట్ ను ఆయన మంత్రి మండలిలో ఉప ముఖ్యమంత్రి పదవి లో కొనసాగటానికి కూడా ఒప్పించలేక పోయారన్న విషయం ఇంటా బయట గుప్పుమని పార్టీ పరువు రాహుల్ ప్రతిష్ఠను మంటగలిపింది. రాహుల్ గాంధి అసమర్ధతతో ఇక సీఎం పదవిని ఆశించిన సచిన్ పైలట్, చివరకు ఉప ముఖ్యమంత్రి పదవితోనే సర్ధుకోవాల్సి వచ్చింది
రాజస్థాన్
శాసన సభ్యులు ముఖ్యమంత్రి ఎన్నికను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగిస్తూ ఏకవాక్య
తీర్మానాన్ని చేసినప్పుడు, ఆ సమయానికి స్పందించి తన నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే నిర్ణయాత్మక శక్తిని నాయకుడుగా, నాయకత్వాన్ని నిలబెట్టుకునే
అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారు.
ఊగిసలాట ధోరణివల్ల పార్టీపై పట్టుసాధించలెదని సందేహం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఇచ్చినట్లు అయింది. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య రాజీ కుదుర్చేందుకు మూడు రోజుల సమయం తీసుకోవడం మాత్రం సమంజసం కాదు. పార్టీని నడపడం లోనే నిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రదర్శించలేని నాయకుడు రేపు దేశానికే ఎలా నాయకత్వం వహిస్తారన్న అనుమానం ప్రజలకు కలగక మానదు.
కుడి ఎడమల అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ లతో కలిసి ఉల్లాసంగా నవ్వుతున్న ఫొటోను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దానికి ది యునైటెడ్ కలర్స్ ఆఫ్ రాజస్థాన్ అని కూడా శీర్షిక తగిలించారు. ఫొటోలో ఉన్న ముగ్గురిలోనూ విజయ దరహాసం కనిపిస్తోంది కానీ, అది అర్ధసత్యం మాత్రమే.
ముఖ్యమంత్రి పదివికి పోటీపడిన అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ లను ఒప్పించడానికి ఆయనకు ఇన్ని రోజులు పట్టడం, పార్టీమీద ఇంకా ఆయన పట్టు సాధించ లేదనడా నికి నిదర్శనం.నిన్న ఆదివారం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ లు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విషయం తెల్సిందే. ఇక ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా భూపేశ్ బఘెల్ పేరును రాహుల్ మరింత ఆలస్యంగా ఆదివారం నాడు ప్రకటించారు.
మూడు హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,
రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి
ఏర్పడినప్పుడు ముగ్గురు సీఎంలను ఎంపిక చేయడంలో రాహుల్ గాంధీ తన నిర్ణయాత్మక
నాయకత్వాన్ని నిరూపించుకోలేకపోయారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు తేలిన రోజునే
మూడు రాష్ట్రాల సీఎంలను రాహుల్ గాంధీ ఖరారు చేయాల్సింది.