జరుగుతున్న పరిణామాలు.. జరిగే పర్యవసనాలు.. వచ్చే ఫలితాలను అంచనా వేస్తున్న రాజకీయ విశ్లేషకులు ఈ మాటలే అంటున్నారు. వైసీపీ నాయకులకు కొంత బాధ కలిగించినా.. జగన్ వేస్తున్న తప్పటడుగులు పార్టీకి మరింత చేటు తెస్తాయని చెబుతున్నారు. తాను అధికారంలోకి వచ్చే మాట అటుంచి.. ప్రతిప్రతిపక్షం అనే హోదాను సైతం ఈ దఫా ఎన్నికల్లో కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. మరి అంతగా జగన్ దిగజారుతున్నాడా? అనేది చర్చకు వస్తున్న విషయం. ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్ ప్రజల సమస్యలపై ఎప్పుడో తనకు అధికారంలోకి వస్తే.. స్పందిస్తాను... పరిష్కరిస్తాను.. అని చెబుతున్నాడు.
ప్రజానాయకుడిగా..ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ ఇలా మాట్లాడడం ఏమేరకు సమంజసం? అనేది కీలక ప్రశ్న. ఈ సమయంలోనే జగన్ తండ్రి వైఎస్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నసమయంలో జరిగి ఓ ఘటనను తెరమీదికి తెస్తున్నారు.. అప్పటి రాజకీయ నేతలు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను గణనీయంగా పెంచింది. అదేసమయంలో నీటి మీటర్ల అంశాన్ని కూడా తెరమీదికి తెచ్చింది.దీంతో ప్రజల నుంచి తీవ్ర ఆవేదన, నిరసన వ్యక్తమైంది. వెంటనే స్పందించిన వైఎస్ అన్ని పక్షాలను కూడగట్టి.. చంద్రబాబుపై పోరుకు తెరదీశారు. అప్పట్లో విద్యత్ చార్జీలపై జరిగిన రగడం అంతా ఇంతా కాదు. ఏకంగా చంద్రబాబు వైఎస్పైనా పీజేఆర్పైనా కేసులు నమోదు చేయమని ప్రస్తుతం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనురాధను అప్పట్లో ఆదేశించారు కూడా!
అయినా వైఎస్ ఎక్కడా మేం అధికారంలోకి వచ్చాక చేస్తామని చెప్పలేదు. ప్రజల్లో భరోసా నింపారు. జరిగిన ఆందోళన నేపథ్యంలో చంద్రబాబు విద్యత్ చార్జీల పెంపు అంటేనే ఇప్పటికీ జంకే పరిస్థితి ఉంది. మరి ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్.. వైఎస్ చేస్తున్న రాజకీయాలు ఒకింత విస్మయం కలిగిస్తున్నాయి. సీఎం తర్వాత సీఎం స్థాయి(విపక్షంలో ఉన్నా)లో ఉన్న జగన్.. అధికారాన్ని భద్రతను వినియోగించుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు సంబంధించి ఏ ఒక్క విషయంలోనూ ఇప్పటి వరకు పోరు చేసింది లేదు. సాధించింది లేదు. రాజధాని రైతుల ఆందోళన కావొచ్చు.. పశ్చిమ గోదావరిలోని ఆక్వా పరిశ్రమ వివాదం కావొచ్చు.
శ్రీకాకుళం కిడ్నీ బాధితులు, అగ్రి గోల్డ్ బాధితులు, విశాఖ పోర్టు వివిదం, మచిలీపట్నం పోర్టు నిర్వాసితుల వివాదం, పోలవరం అవినీతి(ఈ విషయాన్ని కేంద్రం కూడా చెబుతోంది), రాజధాని నిర్మాణాలు, పథకాల మాటున జరుగుతున్న అవినీతి వంటి అనేక విషయాల్లో జగన్ ఓ ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశారనే దానికి సమాధానం లేదు. పోనీ.. ప్రజలకు ఉపయోగపడేలా ఏవైనా నాలుగు మంచి సలహాలు, సూచనలు అయినా చేశారా? తమకు అధికారం ఇస్తేనే తప్ప చేయమని అంటే.. మరి వైఎస్ ఆత్మ చిన్నబుచ్చుకోదా? అనే ప్రశ్నకు జగన్ ఏం సమాధానం చెబుతారు? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నా మిగిలిపోవాల్సిందే.