టీడీపీ అధినేత చంద్రబాబు ఒకపక్క పార్టీని అభివృద్ధి చేసేందుకు పాకులాడుతున్నారు. దీనికి గాను ఆయన 60+లో కూడా 20+లాగా పరుగులు పెడుతున్నారు. రేయింబవళ్లు ఆలోచిస్తూ.. అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నారు. సమాజం లోని అన్ని సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి టీడీపీ అవసరాన్ని గుర్తించేలా చేస్తున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేలాగా కృషి చేస్తున్నారు. మరి పార్టీ అధినేత చంద్రబాబే ఇంతగా కష్టపడుతుంటే.. పార్టీలో ఎదగాల్సిన తమ్ముళ్లు, చంద్రబాబు పదువులు ఇస్తే.. అనుభవిస్తున్న నాయకులు ఏం చేయాలి? పార్టీకోసం అధినేత స్తాయిలో కాకున్నా.. వారికున్న పరిధి మేరకైనా కష్టపడాలి. కానీ, ఏం చేస్తున్నారు? పార్టీని ఎంతగా బజారు పాలు చేస్తున్నారు. బాబు పరువును ఏ విధంగా పాడుచేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నలే తెరమీదికి వస్తున్నాయి.
తాజాగా కడప జల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వ్యవహరించిన తీరు టీడీపీని బజారున పడేసింది. నిన్న మొన్నటి వరకు జగన్ను టికెట్లు అమ్ముకుంటున్నాడనే వ్యాఖ్యలతో ఉరుకులు పరుగులు పెట్టించిన టీడీపీ నేతలకు వాయిస్ లేకుండా చేసేసింది. రూ.30 కోట్లు పెట్టే బీసీ అభ్యర్థి ఎవరో ముందుకు వస్తే.. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ టిక్కెట్ ఇప్పిస్తానని వరదరాజులరెడ్డి బీసీ సంఘాల నేతలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్య చేసి బాబు పరువు తీశారు. 26 బీసీ కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన వరదరాజులు.. బీసీలకు టిక్కెట్ అడగడంలో ఉండే ఉత్సాహం రూ.30 కోట్లు ఇచ్చేందుకు ఉంటే... తానే చంద్రబాబుతో మాట్లాడి టికెట్ ఇప్పిస్తానని చెప్పుకొచ్చాడు.
అయితే, వరదరాజులు వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జగన్ పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నాడని, ఆయన టికెట్ ఇవ్వాలంటే కోట్లకు కోట్లు సమర్పించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనికి ఉదాహరణగా నెల్లూరు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు ఉటంకించారు. భారీ ఎత్తున దుమ్మెత్తి పోశారు. జగన్ డబ్బు మనిషని దుయ్యబట్టారు. జగన్ దగ్గర డబ్బులు తప్ప మనుషులు మాట్లాడలేరని అన్నారు. కానీ, ఇప్పుడు వరదరాజులు దెబ్బతో ఒక్కసారిగా.. పరిస్థితి యూటర్న్ తీసుకుంది. వరదరాజులు చెప్పిన మాటలను బట్టి బాబు కూడా డబ్బుల మనిషేనని అప్పుడే వైసీపీ రివర్స్ కౌంటర్ ప్రారంభించేసింది. మొత్తంగా ఈ వ్యాఖ్యలు బాబు మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు.