తెలుగు ఇండస్ట్రీలో నటుడు భాను చందర్ ఒకప్పుడు మంచి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న భాను చందర్ గత కొంత కాలంగా మూవీస్ కి దూరంగా ఉంటు వస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై భాను చందర్ ప్రశంసలు కురిపించారు. జగన్లో తనకు బుద్ధుడు కనిపిస్తున్నాడని పేర్కొన్నారు.
విశాఖపట్టణంలోని దొండపర్తిలో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ భాను చందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రజల కోసం చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర చూస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుందని..ఎక్కడ చూసినా ప్రజలు జగన్ ని తమ ఆత్మబంధువుగా చూస్తున్నారని అన్నారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీలో చేరినట్టు తెలిపారు.
జగన్లో ఎంతో ఓర్పు, ఔదార్యం ఉన్నాయని కొనియాడారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. జగన్ను కలిసిన భానుచందర్ పాదయాత్రలో ఆయనతో పాటు కలిసి నడిచారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం గొప్ప విషయమని ఈ సందర్భంగా భానుచందర్ పేర్కొన్నారు.