మమత బెనర్జీ ఒక రాజకీయ ఆటంబాంబ్. ఆమె సాధారణంగా ఆమె మనసులో
మాట చెప్పేస్తారు ఏ మొహమాటం లేకుండా. మౌనం ఆమెకు తగదు. ఆమెకు నప్పదు. అలాంటి ఆమె కేసీఆర్
తో భేటీ అనంతరం మౌనాన్ని ఆశ్రయించటంలో ఆశ్చర్యపోనవసరం లేదు. కాని అర్ధం చేసుకోవాలి.
ఆమె కేసీఆర్ ను నమ్మటం లేదు ఆయన రాజకీయాలపై విశ్వాసం లేకపోవచ్చు. అంతకుమించి కేసీఆరును
ప్రధాని నరెంద్ర మోడీ సన్నిహితుడుగా, ప్రతినిధిగా గాని భావిస్తుండవచ్చని వార్తా
విశ్లేషకుల భావన.
జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేఖ లేదా ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు ఇతర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతీయపార్టీల అధినేతలతో వరుస భేటీ లు నిర్వహిస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా ఆదివారం నాడు ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ ను కలిశారు. అక్కడ వాతావరణం ఆశాజనకంగానే ఉన్నట్లుంది.
సోమవారం పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీని కలుసుకుని, ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించిన కేసీఆర్ సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. అయితే కోల్కతాలో మమతతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశం మాత్రం భిన్నంగా సాగింది. ఈ సమావేశంలో పాల్గొన్నప్పుడు మాత్రం తన సహజశైలికి భిన్నంగా కేసీఆర్ తో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జి వ్యవహరించారు.
ఆమె వాస్తవానికి మౌనంగా ఉండరు. తన మనసులో మాటలను కుండబద్దలు కొట్టినట్టు మీడియా ముందు చెప్పేస్తారు. గడగడా మాట్లాడేయడం ఆమె సహజ లక్షణం. ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించేందుకు గత మార్చిలో కూడా కేసీఆర్ కోల్కతాకు వెళ్లి మమత బెనర్జీని కలిశారు. అప్పుడు ఇద్దరూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె తన ఆలోచనలను వెల్లడించారు.
సోమవారం కేసిఆర్తో సమావేశమైన తర్వాత ఇద్దరూ మీడియా ముందుకువచ్చారు. భేటీ వివరాలు తమ కూటమి ప్రాధమ్యాల గురించి కేసీఆర్ వివరించారు. కానీ
ఆయన మాట్లాడుతున్నంత సేపు మమతా బెనర్జీ మౌనంగా ఉండిపోయారు. గతంలో మాదిరిగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాదు, చివరలో మాత్రం కేసిఆర్ చెప్పిన విషయాలతో తాను పూర్తిస్థాయిలో ఏకీభవించడం లేదన్నారు.
జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలు ప్రముఖ పాత్రను పోషించాలని మమతా బెనర్జీ తొలి నుంచీ కోరుకుంటు న్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే అలాగని కాంగ్రెస్ను పూర్తిగా వ్యతిరేకించడం లేదు. ప్రాంతీయ పార్టీల సమైఖ్య బలంతో ఆమె బీజేపీని నిలువరించాలని మాత్రం భావిస్తున్నారు. బిజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తోడ్కొని వెళ్లాలనే నిశ్చయం గత ఏడాది ప్రారంభం నుంచే ప్రతిపక్షనేతలతో సమావేశమవుతూ వస్తున్నారు.
ఇక డిసెంబరు 10న కూడా చంద్రబాబు సారథ్యంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలు నిర్వహించిన సమావేశానికి మమత బెనర్జి హాజరయ్యారు. ఎన్సీపీ నేత శరద్ పవార్, ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, నేషనల్ కాంఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాలతో గత శుక్రవారం కోల్కతాలో ఆమెతో భేటీ అయ్యారు. గత ఆగస్టులో తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధిలను కూడా కలిశారు.
ఇక, కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా జనవరి 18న కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించనున్న మమత, అన్ని ప్రతిపక్షపార్టీలను ఆహ్వానించారు. ఇక, సోమవారం నాటి మౌనం కేసిఆర్ ఎజెండా మేరకు మాత్రం ఆమె ముందుకు నడవడానికి సిద్ధంగా లేరనేది అర్థ మవుతోంది. నలబై ఏళ్ల సుదీర్ఘ రాజకీయానుభవం గల తమ నేతను ఏవరైనా కలవడానికి వస్తారనే తృణమూల్ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కేసీఆర్ తో భేటీ తర్వాత మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలపై నవీన్ పట్నాయక్, మమత ఇప్పటికే సన్నిహితు ల వద్ద చర్చించారు. తాను అనుకున్నది దక్కిన తర్వాత ఎవరినైనా సరే నట్టేట ముంచే నైజం కేసీఆర్ దని సన్నిహితుల వద్ద ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు పేర్కొన్నారట. ఆయన్ను పూర్తిగా విశ్వసించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారట. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం కేసీఆర్ కు అలవాటేనని చెప్పారట.
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన సోనియా గాంధీపై ఏమాత్రం అభిమానం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ తుడిచిపెట్టిన తీరును ఇరువురు ముఖ్యమంత్రులు తమ సన్నిహితులు పార్టీ పెద్దలవద్ద ప్రస్తావించారట. ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చల అనంతరం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలో భేటీ అవనుండటంపై నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ మనసుల్లో చాలా అనుమానాలున్నాయట.
మోదీ-కేసీఆర్ ల మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని వారు అనుకుంటున్నారట. ప్రాంతీయ పార్టీల నేతలతో తన చర్చల వివరాలను తెలియజేసేందుకే మోదీ తో కేసీఆర్ సమావేశం అవుతుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారట. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే వ్యతిరేక ఓట్లను ఫెడరల్ ఫ్రంట్ పేరు తో చీల్చి నరేంద్ర మోదీని మళ్లీ ప్రధాని పీఠమెక్కించా లన్నదే బహుశా కేసీఆర్ వ్యూహం కావొచ్చని కూడా అనుమానాలు వ్యక్తం చేశారట. అందుకే కేసీఆర్ కు తమ మద్దతు ప్రకటించడంపై వెనక్కి తగ్గారట!