రాష్ట్రంలో అత్యంత కీలకమైన, టీడీపీ, జనసేన పార్టీలకు మంచి బలం ఉన్న జిల్లాగా తూర్పుగోదావరి తరచుగా వార్తల్లోకి వస్తోంది. ఇక్కడ పాగా వేసే పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తోంది. దీంతో ఈ జిల్లాలో సామాజిక వర్గాలకు కూడా రాజ కీయ పార్టీలు ప్రాధాన్యం పెంచాయి. ఏ సామాజిక వర్గం బలం ఎంతో తెలుసుకుని, వారికి పెద్ద పీట వేస్తున్నారు. ముఖ్యంగా గెలుపు గుర్రాలుగా భావిస్తున్న వారికి ఖచ్చితంగా టికెట్లు ఇవ్వాలనే నియమంతో అధికార పార్టీ ముందుకు వెళ్తోంది. గెలుపు గుర్రం ఎక్కడం కష్టం అని భావిస్తే.. సిట్టింగునైనా మార్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇక, జనసేనాని పవన్ కూడా ఇక్కడ తన సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి,.. సీఎం సీటును అధిరోహించాలని బలంగా విశ్వసిస్తున్న వైసీపీ అధినేత జగన్ మాత్రం తనకు తానుగా ఇక్కడ పార్టీని భూస్థాపితం చేయాలని నిర్ణయించుకున్నారా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నా యి. ప్రధానంగా ప్రతి ఓటు ప్రతి సీటును చాలా కీలకంగా భావిస్తున్న ఎన్నికల్లో ఆచి తూచి అడుగులు వేయాల్సిన అధినేత.. కొందరు నేతల ఒత్తిడి లోనవుతున్నారని అంటున్నారు సీనియర్లు.. సరే.. ఇంతకీ ఏం జరుగుతోందంటే.. తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గత ఎన్నికల్లో వైసీపీ చావు దెబ్బ తగిలింది. అమలాపురం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పి.గన్నవరం నుంచి చిట్టిబాబు, రాజోలు నుంచి రాజేశ్వరరావు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
పోనీ.. ఈ నాలుగేళ్లలో ఏమన్నా వైసీపీ అభివృద్ధి చేశారా? అంటే అది కూడాలేదు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లింది కానీ, పార్టీ తరఫున గట్టిగా వాయిస్ వినిపించింది కానీ.. జగన్ పేర్కొంటున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లో ప్రచారం చేసింది కూడాలేదు. అంతేకాదు. ప్రధాన విపక్ష్ంగా స్థానిక సమస్యలపై ప్రజలతో కలిసి పోరాడింది కూడా ఏమీ లేదు. మరి ఇలాంటి వారిని ఏం చేయాలి? పక్కన పెట్టి వీరికన్నా బలంగా ఉన్న నాయకులను లేదా ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతారని భావిస్తున్న నేతలకు చాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ దిశగా జగన్ పనిచేయడం లేదని, తన ఇష్టాను సారం వ్యవహరిస్తున్నారని అంటున్నారు సీనియర్లు.
ఈ మూడో చోట్ల కూడా ఓడిపోయిన వారికే మళ్లీ టికెట్లు ఇస్తున్నారని చెబుతున్నారు. పోనీ వారికే ఇద్దామని అనుకున్నా.. క్షేత్రస్థాయిలో వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రజల్లో వారి రేటింగ్ ఎంత? ఇప్పుడున్న పరిస్థితిలో వారికి టికెట్లు ఇస్తే.. రిజల్ట్ ఎలా వస్తుంది? అనేకీలక విషయాలను కూడా పట్టించుకోకుండానే జగన్ వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో కోనసీమలో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తామని చెపుతున్నారు.