ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రోజు ఒకే రోజు రెండు కీలక ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన సెక్రటేరియట్ భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. సెక్రటేరియట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కార్యాలయాలను అయిదు టవర్లుగా నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకూ ఏపీ తాత్కాలిక సెక్రటేరియట్ బిల్డింగులు తప్ప ప్రభుత్వం వేరే భవనాలు నిర్మించలేదు. ఇప్పుడు అత్యంత కీలకమైన సెక్రటేరియట్ టవర్లకు పనులు మొదలయ్యాయి. ఇవి పూర్తయితే అమరావతి ముఖ చిత్రంలో స్పష్టమైన ప్రగతి కనిపించే అవకాశం ఉంది. అత్యంత వేగంగా పనులు జరిగేలా కొత్త టెక్నాలజీని వాడుతున్నారు.
మరో కీలక ఘట్టం కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన. కడప ఉక్కు కర్మాగారం నిర్మించాలని ఇన్నాళ్లు కేంద్రాన్ని వేడుకున్న ఏపీ సర్కారు కేంద్రం సాయం పై ఆశలు వదిలేసుకుంది. అందుకే ఈ పరిశ్రమను స్వయంగా చేపట్టాలని నిర్ణయించింది. ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశ్రమ నిర్మించి తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.
ఈ పరిశ్రమ శంకుస్థాపన సందర్భంగా కడప జిల్లా ఎం.కంబాలదిన్నెలో సీఎం చంద్రబబాు పైలాన్ను ఆవిష్కరించనున్నారు. మొత్తంత 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పరిశ్రమను స్థాపించనున్నారు. 3 వేల ఎకరాల్లో ఈ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తారు. ఏడాదికి 3మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయడం ఈ పరిశ్రమ లక్ష్యం. కడప ఉక్కు పరిశ్రమ సాధించేవరకూ గడ్డం తీయనన్న టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ దీక్ష విరమించనున్నారు.