తెలుగునాట పత్రికలు క్రమంగా తమ విశ్వసనీయత కోల్పోతున్నాయి. ప్రధాన పత్రికల్లో ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో.. వ్యతిరేకంగానో ఉన్నాయన్న భావన పాఠకుల్లోనూ విస్తృతంగా కలుగుతోంది. ఇక ప్రధాన పార్టీల కార్యకర్తలు నేరుగా సదరు మీడియా సంస్థలపైనే విమర్శలు గుప్పించడం ఇటీవల తరచూ చూస్తున్నాం.
ఏ ఒక్క వార్తాపత్రికనో చదవి ఒక అభిప్రాయానికి రావడం ఈరోజుల్లో కష్టంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న మీడియాను ప్రత్యర్థులు ఎల్లో మీడియాగా వర్ణిస్తూ విమర్శిస్తుంటారు. ఇప్పుడు ఈ ఎల్లోమీడియాను ప్రజలు నమ్మే రోజులు పోయాయంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చెప్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయంటూ ఆయన ఓ ట్వీట్ ద్వారా కామెంట్ చేశారు. ఆయన తన ట్వీట్ లో ఇంకా ఏమన్నారంటే.. 1980-90ల కాలంలో పత్రికల్లో ఏది వచ్చినా ప్రజలు నమ్మేవారు ఆ తర్వాత మీడియా విస్తృతి పెరుగుతూ వచ్చింది.
ఇప్పుడు రకరకాల సమాచారం వస్తుంటే నిజమేదో, అబద్ధమేదో తెలిసిపోతుంది. ప్రజలు అప్డేట్ అయినా పాపం చంద్రబాబు, ఆయన కుల మీడియా తాము ఏది వదిలినా ప్రజలు దానినే విశ్వసిస్తారనే భ్రమలో ఉన్నారు అంటూ విజయసాయిరెడ్డి ఎల్లో మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. ఎల్లో మీడియా సంగతి సరే. మరి జగన్ కు సైతం సొంత మీడియా ఉంది కదా. దానిపై విజయసాయి ఏమంటారో..