రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ప్రజల ఆశీస్సులు, వారి కరుణ లేని పార్టీల పరిస్థితి రాను రాను సన్నగిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అతిపెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి భూతద్దం పట్టుకుని వెతికినా.. సాక్షాత్తూ సోనియా గాంధీ వచ్చినా .. మెరుగు పడేలా కనిపించడం లేదు. కేంద్రంలో పదవులు ఇస్తాం.. రా రమ్మంటున్నా.. ఆ పార్టీలో చేరేందుకు నేతలు ముందుకు రాని పరిస్తితి ఏర్పడింది. ఇక, ప్రత్యేక హోదా దెబ్బతో బీజేపీ పరిస్తితి కూడా ఇలానే తయారవుతోంది. రాష్ట్ర విభజన తాలూకు అమలు చేయాల్సిన హామీల విషయంలో ఈ పార్టీ వ్యవహరించిన తీరుతో బీజేపీ అడ్రస్ దాదాపు గల్లంతయ్యేలా కనిపిస్తోందని ఇప్పటికే పలు సర్వేలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలకంగా ఉన్న మరో పక్షం.. ప్రధాన విపక్షం వైసీపీ పరిస్థితిపైనా ఇదే తరహా చర్చ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో దూసుకుపోయి అధికారంలోకి వద్దామని ఈ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే, గుడ్డిలో మెల్ల చందంగా 67 స్థానాల్లో ప్రజలు పట్టం కట్టారు. అయితే, ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవడంలో పార్టీ అధినేత జగన్ పూర్తిగా విఫలమయ్యారు. పోయే వారు పోనీ! అంటూ వితండ వాదానికి దిగారు ఫలితంగా 23 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు పరిస్థితి ఏమన్నా మెరుగు పడుతోందా? జగన్ సంకల్పించిన ప్రజా సంకల్ప యాత్ర ఫలితాన్ని ఇస్తుందా? వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతుందా? అధికారంలోకి వస్తుందా? అనే ప్రశ్నలు సాధారణంగానే తెరమీదికి వస్తున్నాయి.
నిజానికి ఇప్పటికే అటు అధికారికంగా.. ఇటు ఆర్థికంగా కూడా జగన్ సంకట స్థితిలో ఉన్నాడు. ఆయన వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చితారాల్సిన అవసరం ఉంది. ఒక అధికారం దూరమైతే.. పరిస్థితి ఏంటి? మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే.. వైసీపీ ఉంటుందా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. నిజమే! మళ్లీ చంద్రబాబు అధికారంలోకి కనుక వస్తే.. వైసీపీకి శరాఘాతం తప్పదనే వ్యాఖ్యలు బాహాటంగానే వినిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో 50 మంది ఎమ్మెల్యేలను వైసీపీ గెలిపించుకున్నా.. చంద్రబాబు మళ్లీ తన చాణిక్యంతో వారిని కూడా తన బుట్టలో వేసుకునే ప్రమాదం పొంచి ఉంది ఇదే జరిగితే.. పార్టీ ఉనికికే ప్రమాదం అంటున్నారు పరిశీలకులు. మరి దీనిని దృష్టిలో ఉంచుకుని జగన్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు.