తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా వివాదాస్పదంగా నడుస్తున్న ప్రత్యేక కోర్టు గొడవ ముగిసింది. జనవరి 1, 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటవుతుంది. ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడా అని ఊరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు బుధవారం ఉత్తర్వులు విడుదలైన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు కార్యకలపాలు ప్రారంభించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కోర్ట్ భవనాలు సిద్ధం కానందున సీఎం క్యాంప్ ఆఫీస్నే హైకోర్టు కార్యకలాపాలకు వాడేలా ప్రతిపాదించారు.
తాజాగా కొత్తగా ఏర్పాటుకానున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ నియమితులయ్యారు. ఏపీ హైకోర్టులో సీనియర్ అయిన ప్రవీణ్కుమార్ను చీఫ్ జస్టిస్గా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు. ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ నేపథ్యానికి వస్తే..1961 ఫిబ్రవరి 26న హైదరాబాద్లో ప్రవీణ్కుమార్ జన్మించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో చదువుకున్నారు. లిటిల్ ఫ్లవర్ జూనియర్లో కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నిజాం కళాశాలలో బీఎస్సీ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి లా పట్టా అందుకున్నారు. 1986లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 2012లో ఏపీ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా, పూర్తి స్థాయి జడ్జిగా 2013లో నియమితులయ్యారు. క్రిమినల్ లాయర్ గా ప్రవీణ్ కుమార్ కు మంచిపేరు ఉంది.