ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా? బుల్లెట్ దిగిందా? లేదా!- ఇది మహేష్బాబు సినిమాలోని ఓడైలాగ్! నేటి తరం రాజ కీయాలకు ఈ డైలాగ్ ఖచ్చితంగా సరిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. రాజకీయాల్లో ఏం మాట్లాడుతున్నాం.. ఏం చేస్తున్నాం.. అనే విషయాలు ఏనాడో తెరమరుగయ్యాయి. ప్రజల ముందు ఒకమాట.. తెరవెనుక చేత మరొకటి! అన్న చందంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక, అధికారంలోకి రావాలనుకునే పార్టీల పరిస్థితి కూడా ఇలానే ఉంటోంది. ఏదో విధంగా అధికారంలోకి వచ్చేయడమే! అవసరమైతే.. పార్టీ సిద్ధాంతాలను, పార్టీ విధానాలను సైతం పక్కన పెట్టి మరీ ప్రజల్లో గెలిచేందుకు పార్టీలు పాకులాడుతున్నాయి.
దీనికి ఇటీవల జరిగిన తెలంగాణా ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం. బద్ధ శత్రువులుగా మెలిగిన కాంగ్రెస్-టీడీపీలు జట్టుకట్టాయి. ఇక, చంద్రబాబు తెలంగాణాకి పట్టిన శని అని వ్యాఖ్యానించిన ప్రొఫెసర్ కోదండ రామ్ కూడా బాబుతో కలిసి వేదిక పంచు కున్నారు. మరి అలాంటిరాజకీయాల్లో ఇప్పుడు ఏపీ కూడా చేరిపోతోంది. ఇక్కడ అధికారంలో ఉన్న చంద్రబాబును గద్దె దింపేందుకు జగన్ తెరచాటున అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన సిద్ధాంతాన్ని సైతం మా ర్చుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సొంతగానే గెలవాలని తన బలంతోనే గెలవాలనేది జగన్ పెట్టుకున్న ప్రధాన సిద్ధాంతం. ఈ సిద్ధాంతమే గత ఎన్నికల్లో ఆయనను ప్రతిపక్షానికి పరిమితం చేసింది.
అప్పట్లోనే వామపక్షాలు జగన్ను బలపరిచేందుకు రెడీ అయ్యాయి. అయితే, తాను ఒంటరిగానే గెలుస్తానని, సత్తా చాటు తానని జగన్ ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. ఇక, ఇప్పుడు కూడా ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా. ప్రస్తుతం చంద్రబాబు హవాతో జగన్ ఒకింత బెదురుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణా సీఎం కేసీఆర్ సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి కేసీఆర్కు, జగన్కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. 2014 ఎన్నికల్లోనే కేసీఆర్.. జగన్కు అనుకూలంగా వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి కూడా వీరి మధ్య సంబంధాలు చిగురించాయే తప్ప ఎక్కడా వాడిపోలేదు. ఇటీవల కోడి కత్తి దాడి జరిగిన సమయంలోనూ తొలిఫోన్ కేసీఆర్ నుంచే జగన్కు చేరింది. దీంతో రానున్న ఎన్నికల్లో తన సిద్ధాంతాన్ని మార్చుకుని కేసీఆర్ సహకారం తీసుకోవాలని జగన్ ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టు సమాచారం.