దక్షిణాదిలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన కేరళ రాష్ట్రంలోని "శబరిమలై" ఇపుడు "వివాదమలై" గా మారింది. గత సెప్టెంబర్ నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు ప్రధాన కారణం. దేశ సర్వోన్నత న్యాయస్థానం 10-50ఏళ్ల మధ్య వయస్కులయిన మహిళలను అయ్యప్ప స్వామి దేవాలయంలోకి ప్రవేశించేందుకు అనుమతించాల్సిందేనని తీర్పు చెప్పింది.
ఇప్పటి వరకూ 50 ఏళ్లకు పైబడిన వారు మాత్రమే ఈ ఆలయంలో ప్రవేశించేందుకు అర్హత ఉండేది. ఇపుడు సుప్రీం తీర్పుతో ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలను కూడా ప్రవేశించేందుకు అర్హులే. దీనిపై సు ప్రీం తీర్పును అమలు చేస్తామని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేరళలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం చేసిన ప్రకటనలు అయ్యప్ప భక్తులకు ఆగ్రహాన్ని కలిగించా యి.
శతాబ్ధాలుగా శబరిమలై ఆలయంలోకి 50 యేళ్ళలోపు మహిళలను అనుమతించే ఆచారం లేనేలేదని, తమ దేవుడు ఆజన్మ బ్రహ్మచారని, అందులోనూ పిన్నవయసు మహిళలు ఆలయంలోకి రావాలంటే 41 రోజుల దీక్ష వారి ఋతుక్రమ సమస్యలకు అడ్డంకిగా మారుతుందని, అందువల్లనే 50 ఏళ్ల లోపు మహిళలను అనుమతించడం లేదని అనాదిగా వస్తున్న ఆచారాన్ని హక్కుల పరిరక్షణ పేరిట తుడిచిపెట్టడం సాధ్యమయ్యేది కాదని అటు అయ్యప్ప భక్తులసంఘం, ఇటు దేవాలయ పాలకవర్గం చెపుతున్నాయి.
అయితే తాజాగా శబరిమల అయ్యప్పను మరో మహిళ దర్శించుకుంది. శ్రీలంకకు చెందిన 46 ఏళ్ల శశికళ అనే మహిళ నిన్నరాత్రి తన భర్తతో పాటు శబరిమల ఆలయాని కి చేరుకుంది. అక్కడ పవిత్రమై న 18 మెట్లు ఎక్కి అయ్యప్పస్వామిని దర్శించుకోవడంతో అక్కడ మరోసారి కలకలం రేగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆమెకు స్వామి వారి దర్శనాన్ని చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించి అయ్యప్పను దర్శించుకున్న వ్యవహారంతో కేరళ రణరంగంగా మారింది.
బుధవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో బిందు, కనకదుర్గ అనే ఇద్దరు 40 ఏళ్లలోపు మహిళలు, ఆలయంలోకి ప్రవేశంచిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత, తొలిసారి ఈ ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. వీరిని ఆలయంలోకి ప్రవేసించటానికి పోలీసులు రక్షణగా నిలిచారు. కాగా, పోలీసులపై భక్తులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా, మహిళల ప్రవేశంతో ఆలయ అపవిత్రం అయ్యిందంటూ, ఆలయాన్ని పూజారులు సంప్రోక్షణ (ఆలయం శుద్ధి చేయడం) కోసం మూసివేశారు. ఆ తర్వాత తిరిగి ఆలయాన్ని మళ్లీ తెరిచారు.
శబరిమల ఆలయంలోకి బుధవారం ప్రవేశించిన ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వం రాజ్యాంగ బాధ్యతని నిర్వర్తించిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయంలోకి వచ్చిన మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యతని, రాజ్యాంగ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించిందని చెప్పారు. శబరిమలను ఘర్షణ జోన్ గా మలిచేందుకు బీజేపీ-ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ-ఆరెస్సెస్ ప్రేరేపించే హింసను కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు.
శబరిమలలో మహిళల ప్రవేశం నేపథ్యంలో సెక్రటేరియట్ ఎదుట బీజేపీ, సీపీఎం కార్యకర్తలు బాహాబాహీకి దిగటంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు భాష్పవాయు గోళాలు ప్రయోగించిన క్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఘటన నేపథ్యంలో ఆందోళనకారులు ఏడు పోలీస్ వాహనాలు, 79 కేఎస్ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని, 39 మంది పోలీసులపై దాడులకు తెగబడ్డారని సీఎం వెల్లడించారు. అల్లరి మూకలు మహిళలపై దాడులకు పాల్పడ్డాయని, మహిళా మీడియా ప్రతినిధుల పైనా దాడికి దిగారని చెప్పారు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి నిరసనగా బంద్ చేయడమంటే సుప్రీంకోర్టు ఉత్తర్వులను వ్యతిరేకించడమేనని వ్యాఖ్యానించారు.
కేరళలో శబరిమల కర్మ సమితి పేరుతో హిందూసంఘాలు రాష్ట్రవ్యాప్తంగా 12 గంటల హర్తాళ్ కు పిలుపు ఇచ్చాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళ లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు మూడు నెలల కిందట ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కనకదుర్గ (44), బిందు (42) శశికళ (46) అనే మహిళలు అన్ని అడ్డంకులు, కట్టుబాట్లను అధిగమిస్తూ ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. వీరి ఆలయ ప్రవేశంపై హిందూ సంఘాలు, బీజేపీ, ఆరెస్సెస్ భగ్గుమంటున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంస్థ లు, కేరళకు చెందిన కొన్ని ప్రజాసంఘాలు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు, రాళ్లదాడులకు సైతం దిగడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ముఖ్యంగా అధికార సీపీఎం కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. పోలీసులు, సీపీఎం కార్యకర్తలతో వారు ఘర్షణకు దిగడంతో చాలా ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ హింసకు బీజేపీ, ఆరెస్సెస్లే కారణమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. శబరిమలకు వెళ్లిన ఇద్దరిని ప్రభుత్వం తీసుకెళ్ల లేదని, వారు సాధారణ భక్తుల్లాగే అయ్యప్పను దర్శించుకున్నారని చెప్పారు. అలాగే మహిళల దర్శనం తర్వాత పూజారులు ఆలయాన్ని శుద్ధి చేయడాన్ని ముఖ్యమంత్రి తప్పుబట్టారు.
శబరిమల స్వామిని బుధవారం ఇద్దరు మహిళలు దర్శించుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ మహిళలపై బీజేపీ నేత, ఎంపీ మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న ఇద్దరు మహిళలు నక్సలైట్లు అంటూ ఆరోపించారు. ఆ ఇద్దరు మహిళలు భక్తులు కాదని, మహిళా మావోయిస్టులని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులతో సీపీఎం నేతలు ఒప్పందం కదుర్చుకొని వాళ్లను ఆలయంలోకి పంపించారని ఆయన ఆరోపించారు. కేరళ ప్రభుత్వం సీపీఎం పార్టీ, మావోయిస్టులతో కుమ్మకయ్యిందని విమర్శించారు. హిందూ ఆలయం, అయ్యప్ప భక్తులకు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో భాగంగానే ఆ మహిళలు ఆలయంలోకి ప్రవేశించారన్నారు.