జగన్ ఆస్తుల కేసు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అనుమానించినట్టే జరిగింది. విచారణ పూర్తయి వాదనల దశకు వచ్చిన జగన్ ఆస్తుల కేసు ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకూ జగన్ ఆస్తుల కేసును సీబీఐ జడ్డి వెంకటరమణ పర్యవేక్షిస్తున్నారు.
ఇప్పుడు హైకోర్టు విభజన కారణంగా జస్టిస్ వెంకటరమణ ఏపీకి బదిలీ అయ్యారు. జగన్ ఆస్తుల కేసులో మొత్తం 11 చార్జ్ షీట్లు దాఖలయ్యాయి. వాటిలో 3 చార్జ్ షీట్లలో విచారణ సాగుతోంది. ఇప్పుడు జడ్డి బదిలీ కావడంతో ఈ కేసులు కొత్త జడ్డికి అప్పగించాల్సి ఉంటుంది.
ఆ జడ్డి మళ్లీ మొదటి నుంచి ఈ కేసుల విచారణ చూస్తారని న్యాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ కేసును ఈనెల 25కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే హైకోర్టు విభజన ద్వారా జగన్కు బిగ్ రిలీఫ్ లభించినట్టే చెప్పాలి. దీంతో జగన్ ఆస్తుల కేసు విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
కోర్టు విభజన సమయంలో ఇలాంటి సాంకేతిక ఇబ్బందులు సహజమే. అయితే అవి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండటం వల్ల ఈ కేసు విచారణపై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ విషయాన్ని ఊహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగానే జగన్ కోసమే హైకోర్టును విభజిస్తున్నారా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.