రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పై వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మహిళలను అవమానించారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆగ్రా లో బుధవారం జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుపట్టారు.
ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక మహిళను అడ్డు పెట్టుకుని ప్రదాని నరేంద్ర మోడీ పార్లమెంటు నుంచి పరారు అయ్యారు అని వివాదాస్పదంగా మాట్లాడారు.
రఫేల్ యుద్దవిమానాల ఒప్పందంపై ఆయన విమర్శలు కురిపిస్తున్న క్రమంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు లో జవాబు ఇవ్వడాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించి ఈ వ్యాఖ్య చేశారు. అయితే మహిళా జాతిని అవమానించడమేనని ప్రదాని మోడీ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఈ దేశ మహిళలను అవమానిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్పై రాహుల్ ఒక మహిళ అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
రాఫెల్ ఒప్పందంపై రక్షణమంత్రి నిర్మల సీతారామన్ లోక్-సభలో ఒక్కొక్క వాస్తవాన్నివెల్లడిస్తూ ప్రతిపక్షం నోరు మూయించినా, కాంగ్రెస్ నేతలు ఆ మహిళా రక్షణమంత్రిని అవమానిస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక మహిళకు జరిగిన అవమానం కాదు దేశం లోని మహిళా శక్తి కి జరిగిన అవమానం. ఇందుకు ఆ బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేసిన నేతలు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ దేశంలో ఒక మహిళ తొలిసారి రక్షణ మంత్రి కావడం దేశానికే గర్వకారణం అని అన్నారు. కాగా దీనిపై రాహుల్ గాంధీ మీద మహిళా కమిషన్ లో పిర్యాదు చేశారు. మహిళా కమిషన్ రాహుల్ గాంధీకి నేడు నోటీసు జారీ చేస్తుందని సమాచారం.
అంతకు ముందు షోలాపూర్ లో నిన్న బుధవారం జరిగిన ఒక బహిరంగసభలో మోదీ మాట్లాడుతూ, వేల కోట్ల రూపాయల యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో రాఫెల్ సంస్థకు వ్యతిరేకంగా క్రిస్టియన్ మిషెల్ పనిచేశారని ఆరోపించారు.
తనను తాను మరోసారి చౌకీదార్ గా చెప్పుకున్న మోదీ, అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి వేసే "సఫాయి" పనిని తాను చేపట్టానని, ఈ మోదీ ప్రత్యేకమైన మట్టితో తయారైనవాడు. ఆయనను ఎవరూ భయపెట్టలేరు లేదా ప్రలోభపెట్టలేరు. ప్రతి పైసాకు లెక్క తీస్తాను. అంతవరకు ఈ చౌకీదార్ నిద్రపోడు. తప్పుచేసే వారిని చీకటిలో కూడా పట్టుకోగలడు. వారు నన్ను ఎంతగానైనా దూషించవచ్చు. కానీ అవినీతిని పెకిలించివేసే పనిని మాత్రం ఆపివేయబోను అని ప్రధాని పేర్కొన్నారు.
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని ప్రధాని మోదీ సమర్థించుకున్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్నవారికి ఈ బిల్లు లోక్సభ లో ఆమోదం పొందడం చెంపపెట్టు వంటిదని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు వల్ల అణగారిన వర్గాలు, దళితులు, గిరిజనుల హక్కులకు ఎటువంటి నష్టం ఉండదని తెలిపారు. ఇక పౌరసత్వ బిల్లు వల్ల అసోం, ఈశాన్య రాష్ట్రాల ప్రజల హక్కులు ఏమాత్రం తగ్గిపోవని చెప్పారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలోని పాలక బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎన్నడూ ఒకరి ముఖం ఒకరు చూడని రాజకీయ ప్రత్యర్ధులు, బద్దశత్రువులు సైతం ఏకమవుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని ఆగ్రా పర్యటనలో భాగంగా ₹2980 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.