ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాలు ఎంతో వేడక్కి పోతున్నాయి. ఏపిలో ముఖ్య పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ, జనసేన మద్య హోరా హోరీ యుద్దమే కొనసాగుతుంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీ నేతలు ప్రచారాలు ముమ్మరం చేస్తూ వస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’ నిన్నటితో ముగిసింది.
ఈ సందర్భంగా ఇచ్చాపురంలో ఓ పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. నేటి మధ్యహ్నానం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు జగన్ అలిపిరి చేరుకున్నారు. తిరుమలేశుడిని దర్శించుకోవడం కోసం అక్కడ నుంచి కాలినడకన బయలుదేరారు. మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి తన నడకను జగన్ ప్రారంభించారు.
ఈరోజు సాయంత్రానికి కొండపైకి చేరుకున్న అనంతరం స్వామి వారిని జగన్ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆయన ఆశీస్సులు పొందనున్నారు. జగన్ వెంట పార్టీ నాయకులు, భక్తులు తరలి వెళుతున్నారు. ఈరోజు రాత్రికి తిరుమలలో జగన్ బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు జగన్ చేరుకుంటారు.