ఆంధ్రప్రదేశ్లో అవినీతి తారస్థాయికి చేరిందన్న విమర్శలు వస్తున్నాయి. అప్పటివరకూ అధికారుల స్థానాల్లో ఉన్నవాళ్లే బయటకు వచ్చి ఈ మాటలు చెబుతుంటే ఆశ్చర్యం కలుగుతోంది. తాజాగా ఏపీ సర్కారు అవినీతిపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం మరోసారి గళం విప్పారు.
ఏపీ సర్కారులో జరుగుతున్న అవినీతిని గణాంకాలతో వివరించారు. ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం.. పెద్ద ప్రాజెక్టుల్లో 40 శాతం నిధులను సీఎం నుంచి ఎమ్మెల్యే వరకూ పంచుకుంటున్నారట. ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా రోజూ ఇసుక అక్రమాల్లో 7 కోట్ల రూపాయలు టీడీపీ నేతలు సంపాదిస్తున్నారట.
ఏపీ గృహ నిర్మాణంలో పెద్ద స్కామ్ జరుగుతోందట. దేశమంతటా చదరపు అడుగుకు రూ. 1300 తీసుకుంటుంటే.. ఏపీలో మాత్రం రూ. 10,000 ఇస్తున్నారట. అక్రమార్జన కోసం ఫైబర్నెట్ పథకంలో రూ. 1200 లకు దొరికే సెటప్ బాక్సును రూ. 14 వేలు పెట్టి కొంటున్నారట.
జాతీయరహదారుల్లో కిలోమీటరుకు 18 కోట్లు ఇస్తుంటే.. అమరావతిలో మాత్రం అమరావతిలో రోడ్ల నిర్మాణానికి 36 వేల కోట్లు ఇస్తున్నారట. ఇలా ప్రతిపథకంలోనూ అవినీతి రాజ్యమేలుతోందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం విమర్శిస్తున్నారు. మరి ఈ ఆరోపణలపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారో..?