రాజకీయాల్లో పొత్తులు కామన్. ఏ పార్టీ వెళ్లి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి? ఏ పార్టీ నాయకులు ఏ పార్టీ జెండాలు మోయాలి. అనేది అప్పటికప్పుడు అవసరాన్ని బట్టి.. అవకాశాన్ని బట్టి పార్టీలు నిర్ణయించుకునే ప్రక్రియ! ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగిన నేపథ్యంలో ఎక్కడికక్కడ కేంద్రంపై పోరాడే మిషతో కావొచ్చు.. లేదా ఓటు బ్యాంకులను పెంచుకునే ఉద్దేశంతోకావొచ్చు.. అధికారంలోకి రావాలనే ఆశతో కావొచ్చు.. ఏ పార్టీ అయినా పొత్తులకు అతీతం కాదు. ఏపీలోనూ ఇది మనం చూస్తున్న పరిణామమే. అధికార టీడీపీ గడిచిన ఐదేళ్లలో రెండు జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అదే మంటే అవసరార్థం అని సరిపెట్టుకుని అనుకూల ప్రచారం నెత్తికెత్తుకుంది. నిజానికి రాష్ట్రం ఇన్ని ఇబ్బందులు పడేందుకు కారణమైన విభజనకు కారకమైన కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. అది కాపురమని వివరించడంలో సక్సెస్ అయ్యారు టీడీపీ నాయకులు.
కానీ, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ అదేస మయంలో ఏపీ హక్కులను కాపాడే.. ఏ ప్రయోజననాన్ని కూడా విభజన చట్టంలో చేర్చలేదు. ముఖ్యంగా అత్యంత కీలకమైన ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టకుండా కేవలం రాజ్యసభలో ఓ ప్రకటన మాత్రంగా చేసి వదిలేసిన పార్టీని నెత్తికెత్తుకున్న టీడీపీ.. ఆ పార్టీ భజన చేయడంలో పూర్తిగా మునిగిపోయింది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలు, కడప ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వేజోన్ వంటి వాటికి విభజన చోటు కల్పించి కూడా `పరిశీలించి` అనే మాటను చేర్చడం ద్వారా వాటి ప్రాముఖ్యాన్ని తగ్గించేసింది. ఫలితంగా రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడిచి నా.. ఇప్పటికీ వీటి ఏర్పాటు మాత్రం పుంజుకోలేదు. అయినప్పటికీ.. కాంగ్రెస్ మంచిదేనని, దానితో కూటమి కడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నాయకులు. ఇక, ఇప్పుడు తెలంగాణా కోసంఉద్యమించిన కేసీఆర్తో జగన్ జోడీ కట్టడాన్ని తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారు.
ఇది అత్యంత ప్రమాదకరమని, ఏపీని మరోసారి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు కుమ్మరిస్తున్నారు. అయితే, దీనికింత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారు? అనే విషయంపై మాత్రం క్లారిటీ లేకుండా పోవడం ఇప్పుడు ఇక్కడ కొసమెరుపు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా ఉన్నప్పుడు జగన్ వెళ్లి ఎవరితో కలిస్తే మాత్రం తప్పేంటి? అనే ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. పైగా ఓటు బ్యాంకును చీలుస్తారని టీడీపీ భయపడుతోందా? ఇక్కడ కేసీఆర్కు అనుకూలంగా ఓ వర్గం ప్రజలు ఉన్నారనే విషయం ప్రతిఒక్కరికీ తెలిసిన నేపథ్యంలో వారంతా కేసీఆర్కు అనుకూలంగా మారితే టీడీపీకి ఇబ్బంది తప్పదని నాయకులు అనుకుంటున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నా యి.
ఏదేమైనా.. కేసీఆర్-జగన్ కలయికపై టీడీపీలో మొదలైన ఈ తర్జన భర్జన ఎన్నికల సమయానికి మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా.. తాము చేస్తే.. సంసారం.. పక్కవారు చేస్తే.. రంకు అనే నాయకులు ఉన్న టీడీపీలో రాజకీయాలను ఇంత కన్నా మంచిగా ఆశించడం ప్రమాదమే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.