భారత్ వెలుపల భారతీయం దిగ్విజయమే! మన వాళ్ళ ప్రఙ్జాపాటవాలకు కొదవేమీలేదు. భారతీయత ఎక్కడైనా ఎల్లవేళలా వెలిగిపోవలసిందే. అది ఒక సారి గాదు పలు మార్లు ఋజువు అవుతూ వస్తూనే ఉంది. ఇప్పుడు మరో సారి ఋజువు అవుతుంది అమెరికాలో.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగ్గురు ఇండో-అమెరికన్లను తన ప్రభుత్వంలో కీలకమైన పదవులకు నామినేట్ చేశారు. వీరిలో అణుశక్తి నిపుణురాలైన రీటా బరన్వాల్ అనే మహిళ కూడా ఉన్నారు. రీటా బరన్వాల్ ను అమెరికా అణుశక్తి విభాగ అసిస్టెంట్ సెక్రెటరీగా నామినేట్ చేసిన ట్రంప్, ఆదిత్య బంజాయ్ని పౌర హక్కుల పర్యవేక్షక బోర్డు సభ్యునిగా, బిమల్ పటేల్ను ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్రెటరీ గా నామినేట్ చేశారు. వీరి నామినేషన్లను బుధవారం అమెరికా సెనేట్ కు పంపారు.
ఇప్పటివరకు ట్రంప్ 36 మందికిపైగా ఇండియన్-అమెరికన్లను కీలక పదవుల్లో నియమించారు. అణుశక్తి విభాగ సహాయ కార్యదర్శిగా నామినేట్ అయిన రీటా బరన్వాల్, ప్రస్తుతం గెయిన్ (గేట్వే ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ ఇనిషియేటివ్) డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. బరన్వాల్ నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపితే అమెరికా అణుశక్తి విభాగంలో ఆమె శక్తిమంతమైన పదవిని చేపట్టడంతోపాటు న్యూక్లియర్ టెక్నాలజీ రిసెర్చ్, న్యూక్లియర్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాలకు బాధ్యురాలిగా వ్యవహరిస్తారు.
మరోవైపు యేల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన ఆదిత్య బంజాయ్, గతంలో అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా తోపాటు సిక్త్స్ యూఎస్ అప్పీల్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెఫ్రీ సట్టన్కు లా-క్లర్క్గా సేవలందించారు. అమెరికా న్యాయశాఖ లీగల్ కౌన్సెల్ కార్యాలయంలో అటార్నీ అడ్వైజర్గా పనిచేశారు. ప్రస్తుతం విద్యాబోధన చేస్తున్నారు.
అలాగే బిమల్ పటేల్ ప్రస్తుతం అమెరికా ఆర్థికశాఖ లోని ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్-సైట్ కౌన్సిల్కు డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీగా పనిచేస్తున్నారు.
అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ కమిటీలో డెమోక్రటిక్ చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తికి చోటు దక్కింది! దక్షిణాసియా నుంచి తొలిసారిగా ఈ కమిటీకి కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం.