ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం వచ్చిందే తడవుగా సమరోత్సాహం తో పరవళ్ళెత్తి ముందుకు దుమికే తొలి నాయకుడు టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తన మాజీ నాయకుడును పనిపెట్టుకొని తలతిరిగే విమర్శలు చేయటంలో సైతం తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏదురే లేదు. హైదరాబాద్ లో చంద్రబాబుకు నిండైన అండగా నిలిచిన ఈ తలసాని శ్రీనివాస్ యాదవే రాజకీయం తెచ్చిన మార్పులతో ఇప్పుడు ఆయన్ని సాకిరెవు పెట్టి ఉతికి ఆరేయటం ఉదృతంగా కనిపిస్తుంది.
మకర సంక్రాంతికి చుట్టం చూపుగా తన బంధువులు, స్నేహితుల వద్దకు వచ్చిన తలసాని రాజకీయాన్ని వెంటతెచ్చానని సాక్షాత్తు విజయవాడలోని ఇంద్రకీలాద్రి దేవత సమక్షంలో ప్రకటించ టమే కాకుండా ఏపీ గడ్డ మీదనే చంద్రబాబుకు తమ అధినేత ఇవ్వనున్న రిటర్న్-గిఫ్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహుశ అది పాశుపతాస్త్రం అంతది అవునో కాదో కాని అది నాడు మహాభారత కాలంలో అర్జుండు అందుకున్న ప్రదేశం కావటం యాదృచ్చికమా? కావాలనే చేశారా? ఆ ప్రకటన. అది చాలదన్నట్లుగా తాజాగా తీవ్రస్థాయిలో చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు.
పూటకో మాట మాట్లాడే చంద్రబాబును చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుంది - అన్న తలసాని చంద్రబాబుతో సమరానికే సిద్ధమై సవాల్ విసిరారు. తాను చంద్రబాబులా శవ రాజకీయం చేయనని (హరికృష్ణ శవం దగ్గర కేటీఆర్ తో చంద్రబాబు టీఆరెస్-టిడిపి ఫ్రంట్ కోసం మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేయటంగా భావిస్తున్నారు) అంతేకాదు, ఏపీలోని యాదవ సంఘానికే కాదు, వెనుక బడిన అన్నీ తరగతుల వారందరికి తాను మద్దతు ఇస్తానని చెప్పారు. తమ ముఖ్యమంత్రి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి దొంగరాజకీయాలు చేయరని, "ఫెడరల్ ఫ్రంట్" అనేదే లేదని చెబుతున్న చంద్రబాబుకు, త్వరలోనే అదేమిటో షాక్ అవుతూ తెలుసుకుంటారని అన్నారు.
చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తారని, ఆయన చిల్లర చితక రాజకీయాలకు తమ సమాధానాలు ధీటుగా ఉంటాయన్నారు. తెలంగాణలో చంద్రబాబు దొంగ రాజకీయం చేస్తే అది సంసారమని, అదే తాము ఏపీలో బహిర్గతంగా చెప్పి రాజకీయాలు చేస్తే వ్యభిచారమా? అని ప్రశ్నించారు. తమ ముఖ్యమంత్రి కేసీఆర్ 15 రోజుల్లో ఏపీకి వస్తారని, దమ్ముంటే అప్పుడు చంద్రబాబు తన ప్రతాపాన్ని చూపించాలన్నారు.
ఏపీలోని చేతగాని మంత్రులు ఫెడరల్ ఫ్రంట్ పైన అనవసర, అర్థరహిత ఆరోపణలు చేస్తున్నట్లు చెపుతూ , చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు తామెవరూ భయపడమని, ఏపీ ప్రజల హక్కుల కోసం తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. తాను ఏపీకి వెళితేనే అక్కడ జనం నుండి అద్భుత స్పందన వచ్చిందని, ఇక తమ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళితే స్పందన ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు.
తనను కలిసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన తలసాని, తన మిత్రులపై చంద్రబాబు చర్యలు తీసుకోవటం ఏమిటి? సరైన సమయంలో సరిగ్గా స్ప్పందించటం ద్వారా వాళ్లే చంద్రబాబుకు షాక్ ఇస్తూ రించటానికి సిద్దంగా ఉన్నారన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు! ఇక కాస్కోండి మీ తలసానిని!