రాజకీయాల్లో మార్పులు వడివడిగా చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో వారసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసింది. గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలు ఈ వారసుల రేసులో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా గుంటూరు రాజకీయాలు తీసుకుంటే.. రాజకీయ దిగ్గజం రాయపాటి సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని వారసుడిగా తీసుకురావాలని నిర్ణయించు కున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నందున ఆ పార్టీ తరఫునే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు.
నరసరావు పేట నుంచి ఎంపీగా లేదా వేరే చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయించుకున్నారు. దీనికి అప్పట్లో చంద్రబాబు కూడా పచ్చజెండా ఊపారు. ఎలాగూ వృద్ధాప్య సమస్యలు, సతీ వియోగం వంటి కారణాల నేప థ్యంలో రాయపాటి రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేందుకు రెడీగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయన నరసరావు పేట నియోజకవర్గం నుంచి తప్పుకొంటే.. ఖచ్చితంగా ఆ టికెట్ను ఆయన కుమారుడు రంగారావుకు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం కూడా జరిగింది. అయితే, ఇటీవల కాలంలో రాయపాటి మళ్లీ తన అభిప్రాయం మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, రాజకీయాలకు దూరం కాబోనని పేర్కొన్నారు.
దీంతో అటు రాయపాటి సాంబశివరావు .. నరసరావుపేట ఎంపీ సీటునుం చే పోటీ చేయడం ఖాయంగా మారింది. దీంతో ఆయన కుమారుడు రంగారావుకు ఎక్కడ సీటు ఇవ్వాలనే విషయంపై చర్చ ప్రారంభమైనట్టు సమాచారం. ప్రస్తుతానికి మంగళగిరి, మాచర్ల, గుంటూరు వెస్ట్ (ఇక్కడ మోదుగుల వేణుగోపాల రెడ్డి ఉన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఈ సీటు దక్కే పరిస్థితి లేదు). సత్తెనపల్లి నియోజకవర్గాలు ఆప్షన్గా ఉన్నాయి.
ఈ నియోజకవర్గాల్లో రంగారావుకు ఏ టికెట్ ఇస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీటిలో ఎక్కడ తనకు కేటాయించిన గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని రాయపాటి అనుచరులు, మద్దతు దారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పుడు రాయపాటి వారసుడి రాజకీయ అరంగేట్రం, టికెట్ వంటి కీలక విషయాలు బాబు కోర్టులోనే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి బాబు ఎలా డిసైడ్ చేస్తారో చూడాలి.