వైసిపిలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరదలచుకున్న వారికి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మొహనరెడ్డి కొన్ని షరతులు విధిస్తున్నట్లు తెలుస్తుంది. రాజకీయాల్లో విశ్వసనీయత, ప్రజాస్వామ్య విలువలు పాటించాలంటూ పదే పదే చెపుతున్న జగన్ వాటిని ఖచ్చితంగా అందరూ ఆచరించాలనే ఉద్దేశంతోనే షరతులు విధిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆ విషయంలో తాను రాజీ పడబోనని ఘంటాపథంగా చెప్తున్నారట.
*ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరతలచే నేతలు ముందుగా తమ పదవులకు రాజీనామా చెయ్యాలని
*ప్రస్తుతం ఏ పార్టీలో అయితే ఉన్నారో, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చెయ్యాలని
*ఎమ్మెల్యే పదవిలో ఉంటే కూడా దాన్ని వదులుకుంటేనే తన పార్టీలోకి ఆహ్వానం ఉంటుందని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారట.
* పార్టీలో చేరే వ్యక్తులకు పార్టీ తప్పక గౌరవం ఇస్తుంది కానీ టిక్కెట్ల విషయం పార్టీ అధిష్టానానికి వదిలేసి ప్రజల కోసం పనిచెయ్యాలంటున్నారట.
ఈ షరతులు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి కూడా ఎదురైంది. మేడా మల్లికార్జునరెడ్డి సోదరులు ముగ్గురు కూడా వైసీపీ లో చేరేందుకు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసిపి కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిసి పార్టీలో చేరబోతున్న విషయంపై చర్చించారు.
అప్పటికే తెలుగుదేశం పార్టీ మేడా మల్లికార్జునరెడ్డి ని తమ పార్టీ నుండి బహిష్కరించింది. పనిలో పనిగా జగన్ అంగీకరిస్తే వైసీపీ కండువా కప్పేసు కుందామని సంతోషపడ్డ మేడా సోదరుల ను కలసిన జగన్ మేడా మల్లికార్జునరెడ్డిని ఉద్దేసించి పార్టీకి ఎమ్మెల్యే పదవికి, ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారా? అని అడిగారట. ఇప్పటికే ప్రభుత్వ విప్ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని మేడా మల్లికార్జునరెడ్డి చెప్పారు. అయితే స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేసి ఈనెల 31 న వైసిపిలో చేరాలని జగన్ ఆదేశించారట. అందుకు అంగీకరించిన మేడా మల్లికార్జునరెడ్డి బుధవారం స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆ తరవాత మీడియాతో మాట్లాడిన మేడా మల్లికార్జునరెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు, ప్రజాస్వామ్య విలువలు తెలిసిన యువనేత జగన్ అంటూ ప్రశంసించారు. గంజాయి వనం నుంచి తులసివనం లోకి వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. రాజశేఖరరెడ్డి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. టీడీపీ అధినేత చెప్పే దొకటి చేసేదొకటి. అక్కడ నాలుగున్నర సంవత్సరాలు నరకయాతన అనుభవించానని ఆయన వాపోయారు.
వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి చంద్రబాబు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారన్నారు.చంద్రబాబు రాజకీయలలో నైతిక విలువలు పూర్తిగా దిగజార్చారని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. రాజకీయాల్లో కనీస విలువలు, విశ్వసనీయత ముఖ్యమని, జగన్ చెప్పినట్లు అలాంటి యువనాయకుడు రాజకీయాల్లో ఉండటం చాలా అరుదు అన్నారు మేడా మల్లికార్జునరెడ్డి.
బాబు చెప్పేది ఒకటి చేసేది మరోకటి అని విమర్శించారు. రైతులకు - డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తానని యువతఓట్లతో అధికారంలోకివచ్చిన చంద్రబాబు వారిని దగా చేశారన్నారు. కాపులను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు అక్రమాలను చూసి జీర్ణించుకోలేక పోతున్నా నని చెప్పారు. నిన్ను నమ్మం బాబూ! అని ప్రజలు అంటున్నారని - అలాంటి వ్యక్తి వద్ద ఉండలేనని మేడా అన్నారు.
చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అన్నారు. ఆయన పనికి రాని మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న దోపిడీని చూడలేకే టీడీపీని వీడానని సంచలన ఆరోపణ లు చేశారు. రూ.800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు.
గతంలో కూడా శిల్పా చక్రపాణి రెడ్డి విషయంలోనూ వైఎస్ జగన్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరుతానని వచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలో చేరాలని షరతు విధించిన విషయం తెలిసినదే. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో చేర్చుకున్నారు వైఎస్ జగన్.
వేరొకపార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చే నాయకులు ఆయా పార్టీల కారణంగావచ్చిన అన్నీ పదవులను వదులు కోవాల్సిందేనని జగన్ మరోసారి ఈ సంధర్భంగా స్పష్టం చేశారు. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్-టాపిక్ అయింది.
ఇది చంద్రబాబు నాయుడికి చెంపపెట్టే! ఏ నైతిక విలువలు పాటించకుండా నాలుగున్నరేళ్ళుగా అబద్ధాలతో పాలన సాగిస్తూ జనాలకు విసుగెత్తిస్తున్న వేళ, వైసిపి యువ అధినేత తీసుకు న్న ఈ నిర్ణయం జనులకు స్పూర్తి నిస్తుందనటంలో సందేహం లేదు. నైతిక విలువల వలువలు వలిచేస్తున్న అధికార పార్టీకి ఇది చావుదెబ్బే! ప్రజల్లోకి ఖచ్చితంగా ఇది దూసుకుపోతుంది.