శతాబ్ధం పైగా అంటే దాదాపు 125 ఏళ్ళు స్వాతంత్ర సంగ్రామం ముందునుండి ఏడు దశాబ్ధాల స్వాతంత్రానంతర కాలంలో దేశ రాజకీయాధిపత్యం వహించిన ప్రప్రధాన రాజకీయపక్షం కాంగ్రెస్ మాత్రమే. అంతే కాదు స్వాతంత్రానంతరం అధికారంలోకి వచ్చి వీరి పాలన సమస్తం నెహౄ-గాంధి కుటుంబ నాయకత్వం లోనే పునీతమైంది. కాకపోతే గత ఐదేళ్లు ఆ కుటుంబం అధికారానికి దూరమైంది.
కాంగ్రెస్ అధినేతల కుటుంబం అధికారం లేకపోతే మనలేదు. అందుకోసం దేశాన్ని దేశప్రజలని అధోగతి పాల్జేసైనా అధికారంలోకి రావాలి. దాని సాధనకోసం ప్రజల ముందు వేసిన బిస్కెట్టే సార్వత్రిక కనీస ఆదాయం అనే స్కీంను తెరపైకి తెచ్చింది. ఇప్పుడు రాహుల్ ప్రియాంకలు గద్దెనెక్కి దేశాన్ని ఏలాలి. అందుకు భారత ప్రజలు యావత్తూ ఓట్లు రాహుల్ గాంధి కుటుంబాని కి మరియు కొత్తగా ప్రియాంక వాధ్రా కుటుంబానికి గుద్దేయాలి. అందుకు ప్రతిఫలంగా ప్రజలకు సార్వత్రిక కనీస ఆదాయం గ్యారెంటీ బిస్కెట్ వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు.
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో రాజకీయ అస్త్రాన్ని అమ్ముల పొది నుండి వెలుపలకు తీశారు తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశం లోని పేదలందరికీ కనీస ఆదాయం కల్పిస్తామని ఉచిత హామీ ఇచ్చారు. దీనితో పేదరికం తొలగి ‘ఆకలి లేని భారత్’ అనే తన స్వపన సాకారం చేస్తారట. ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన కిసాన్ ఆభార్ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు.
‘‘హరిత విప్లవానికి పునాదులు వేసింది కాంగ్రెస్. క్షీర విప్లవాన్నీ, టెలికాం విప్లవాన్నీ తెచ్చింది. ఆహార భద్రత కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకొంది. అదే బాటలో ఇప్పుడు పేదలందరికీ కనీస ఆదాయ భరోసా కల్పించాలన్న నిర్ణయం తీసుకుంది. వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కారు నేతృత్వంలో ఇది జరుగుతుంది. మేము ఛత్తీస్ గఢ్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల రుణాలను మాఫీ చేయాలని భాజపా సర్కారును అడిగితే డబ్బుల్లేవన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లోనూ ఇదే మాట చెప్పారు. దిల్లీలో మోదీ కూడా ఇదే పాట పాడారు. రైతుల రుణాలను మాఫీ చేసేందుకు మన దేశ కాపలాదారు వద్ద రూ.6 వేల కోట్లు లేవుగానీ, 15 మంది పారిశ్రామిక వేత్తలకు 3.5 లక్షల కోట్ల మేర రుణాలు మాఫీ చేయడానికి డబ్బులుంటాయి! మేం అలా కాదు. ఛత్తీస్గఢ్లో అధికారంలోకి వస్తే పది రోజుల్లో అన్నదాతల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చాం. రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా భాజపా చేయలేనిది 24 గంటల్లో చేసి చూపించాం.
నరేంద్ర మోదీ, భాజపాల ప్రయత్నమంతా రెండు రకాల భారత్ లను సృష్టించడంపైనే ఉంది. ఒకటేమో- లబ్ధిదారుల వర్గానిది. ఇందులో రఫేల్ కుంభకోణం, అనిల్ అంబానీ, మెహుల్ ఛోక్సీ, నీరవ్ మోదీ, నరేంద్ర మోదీలు ఉంటారు. మరో భారత్ లో పేదలు, బలహీనవర్గాలు, యువకులు, రైతులు ఉంటారు. మాక్కావాల్సింది ఒక్క ఇండియానే అందులో పేదలందరికీ కనీస ఆదాయం దక్కాలి" అని రాహుల్ అన్నారు.
ఇది మా కల - ఇది మీకు మా భరోసా!
లక్షలాది మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు పేదరికంతో మగ్గుతుంటే మనం కొత్త భారత్ను ఎలా సృష్టించగలం! సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎవరే పరిస్థితుల్లో ఉన్నా అందరికీ కనీస ఆదాయం అనేది ఉండాలి. ఈ సార్వత్రిక కనీస ఆదాయం-యూనివర్సల్ బేసిక్ ఇన్కం గురించి 2016-17లోనే భారత ఆర్థిక సర్వే చెప్పింది. ఒక్కో వ్యక్తికి ₹ 7620 కనీస వార్షికాదాయం కల్పించాలంది. 2019 లో మేము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కనీస ఆదాయ భరోసా (మినిమం ఇన్కం గ్యారెంటీ) కల్పిస్తాం. ఇది మా స్వప్నం. ఇది మా హామీ. - ట్విట్టర్లో రాహుల్ గాంధీ
కనీస ఆదాయ భరోసా పై ఎన్నికల ప్రణాళికలో చెబుతాం: చిదంబరం
సార్వత్రిక కనీస ఆదాయం పై గత రెండేళ్లుగా తీవ్రచర్చ జరుగుతోందనీ, దీన్ని అమలు చేయాల్సిన తరుణం ఆసన్నమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం ట్విట్టర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల ప్రణాళికలో దీన్ని చేర్చుతామని ఆయన తెలిపారు. రాహుల్ గాంధి మరియు బిజెపి వ్యతిరేక ప్రతిపక్షాలన్నీ అభివృద్ధికి చైనాను ఉదాహరణగా చూపుతారు. చైనా నేడు పని సంస్కృతికి చిహ్నం. ఉచితంగా ఎవరికైనా ఏదైనా ఇస్తే వారికి దాని విలువ తెలియదు. ఆహారం ఉచితంగా ఇస్తే సోమరి తత్వం పెరుగు తుంది.
ఉచిత ఆరోగ్యం విద్య ఇస్తే ఆరోగ్య విఙ్జాన భారతం ఉద్భవిస్తుంది. అప్పుడు ఉత్పత్తికి అభివృద్ధికి బాటలు పడతాయి. అప్పుడు ఐదేళ్ళ నుండి పదేళ్ళలోపులోనే భారత్ చైనా స్థాయి అభివృద్ది సాధిస్తుంది. పేదలకు నిరుద్యోగులకు కనీస పని కలిపించటానికి బదులు కనీస ఆదాయం కలిపిస్తే ఈ దేశం మరోసారి పరాదీనంలోకి వెళ్లిపోక తప్పదు. రాహుల్ ఆలోచన ఏమిటి భారత్ ను నిరర్ధక దేశంగా నిర్మించాలను కుంటున్నారా!
అనేక సార్లు కాంగ్రెస్ చిలకపలుకులు వల్లించే రాహుల్ - నీరవ్ మోడీ, మిహల్ చోక్సీ, అనిల్ అంబాని, విజయ్ మాల్యాలు రాత్రికి రాత్రే పుట్టుకు రాలేదు. మీ పాలన లోనే వారి అరాచకానికి అంకురార్పణ జరిగిందనేది మరువ రాదు! ఋణ గ్రహీతలు పెద్దవారైన పిన్నవారైనా - చట్టం ప్రయోగించి వసూళ్ళు చేయాలి. దానికి ఏ రకమైన ఋణాల రద్ధు పరిష్కారమూ కాదు సమాదానమూ కాదు.
సార్వత్రిక కనీస ఆదాయం లేదా యూనివర్సల్ బేసిక్ ఇన్కం గ్యారెంటీకి, సార్వత్రిక బేసిక్ వర్క్ ఇచ్చి కనీస ఉత్పత్తి ని ప్రతి పౌరుణ్ణుంచి సాధించే పని సంస్కృతిని దేశంలో కలిపించాలి. అంతేకాని ప్రజలకు కనీస ఆదాయం ఉచితం లాంటి పదకాలు దేశాన్ని నిర్వీర్యం చేస్తాయి. ఈ దేశ వినాశనం కోరేవాళ్ళే ఇలాంటి పదకాలు తెచ్చి వోట్లేయించుకొని దేశానికి సర్వ సంపూర్ణ భ్రష్టత కల్పిస్తారు. రాహుల్ విధానం చూస్తుంటే దేశాన్ని మరోసారి పరాధీనంలోకి నెట్టేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.