దేశానికి మొదటి సారి ఒక బిసి నేత ప్రదాని అయితే,ఆయన పై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారని, పైగా జయహో! బిసి అంటూ సదస్సులు పెడుతున్నార ని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పై తాను చేసిన వ్యాఖ్యలకు నూరు శాతం కట్టుబడే ఉన్నానని అన్నారు. బీసీ సభలు పెట్టి బీసీలకు అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే అతన్ని దింపుతానంటూ దేశాలు పట్టుకు తిరుగుతున్నాడని మండిపడ్డారు.
చంద్రబాబు తెలంగాణ వెళ్లి నేను లేఖ ఇవ్వటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని అక్కడ మాట్లాడి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీశారని అంటాడని ఆయన అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం మీడియాతో మాట్లాడిన నాదేళ్ళ ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడుగా ఉన్న సమయం లో కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కడుతున్నట్లు నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి తెలిసిందని, దానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చంద్రబాబును తన దగ్గరకి పిలిపించుకున్నారని, వెంటనే తన చేతిలో ఉన్న స్టిక్ తో చంద్రబాబును సీరియస్ గానే కొట్టబోయారని నాదెండ్ల తెలిపారు. అయితే చంద్రబాబును అందరిలో ఎందుకు కొట్టబోయారో? తెలియక తాను తర్వాత ముఖ్యమంత్రి దగ్గరకి వెళ్లి అడిగానన్నారు.
అప్పుడు పార్టీలో ముఠాలు కడుతున్నాడు చంద్రబాబుని ఎవరూ చేరదీయకండి అని చెన్నారెడ్డి చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్ లో చంద్రబాబు దొంగతనం చేసి నట్లు నాదెండ్ల కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తెలిపిన విషయాన్ని మీడియా ఆయన దృష్టికి తేగా అదంతా నిజమే నని అన్నారు.
అలాగే ఇటీవల తాను ఎన్టీఆర్ పై చేసిన చెప్పిన విషయాలన్నీ వాస్తవాలేనని, వాటన్నింటికీ తాను కట్టుబడి ఉంటానని మాజీ ముఖ్యమంత్రి భాస్కరరావు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిని తానే నని, పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ల కు తనను మంత్రి పదవి నుండి ఎన్టీఆర్ తొలగిస్తే ఎన్టీఆర్ ను ముఖ్య మంత్రి పదవి నుండి తాను తీసేశానని తెలిపారు. “వెన్నుపోటు” అంటూ ఈ విషయంలో తనపై 30 ఏళ్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నోట్ల రద్దును సమర్థించింది, రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబు మాత్రమేనన్నారు. ఇప్పుడు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని అంటున్నది కూడా చంద్రబాబే నని నాదేళ్ళ మండి పడ్డారు. తనను విలన్ గా చూపిస్తూ ఎవరు సినిమా తీసినా న్యాయపరమైన విచారణకు వారు సిద్ధంగా ఉండాలని నాదెండ్ల హెచ్చరించారు.