ఏపీ సీఎం చంద్రబాబుతో ఓ పత్రికాధిపతి రహస్యంగా సమావేశమయ్యారన్న వార్త కలకలం సృష్టిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా కథనాలు వస్తాయని ఆ పత్రికకు పేరుంది. ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి ఏపీ సీఎం చంద్రబాబుతో రెండున్నర గంటల పాటు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానల్ అధిపతి రాధాకృష్ణ.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో కలసి ఈ చంద్రబాబును కలిసారట. ఏపీలో రాజకీయ పోరాటం చాలా టఫ్ గా ఉన్న సమయంలో వీరిద్దరూ ఏ ఏ అంశాలపై చర్చించారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయంలో వచ్చేసినందువల్ల రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది.
లగడపాటి రాజగోపాల్ విషయానికి వస్తే.. ఆయన తెలంగాణ ఎన్నికల సందర్భంగానూ హడావిడి చేశారు. సర్వేల పేరుతో నానా హంగామా చేశారు. ఇంకేముంది.. చంద్రబాబు తెలంగాణలో చక్రం తిప్పేశారు.. మహా కూటమి ఘన విజయం సాధించబోతోందంటూ రచ్చరచ్చ చేశారు. కానీ చివరకు అంతా తుస్సుమంది. లగడపాటి సర్వేలను జనంలోకి తీసుకెళ్లడంలో ఆంధ్రజ్యోతి మీడియా చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఏపీలోనూ అలాంటి సర్వేల ప్రచారం చేసే అవకాశమూ లేకపోలేదు. లగడపాటి, రాధాకృష్ణ సీఎంను కలవడంతో ఇక మరోసారి ఏపీలో సర్వేల ప్రచారం జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల రాధాకృష్ణ.. తన కొత్తపలుకు వ్యాసంలో చంద్రబాబు వ్యవహారశైలిపైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును పార్టీ నేతలే పట్టించుకోవడం లేదని.. ఆయన చాలా మెతకగా ఉంటున్నారని కూడా కామెంట్ చేశారు. చంద్రబాబు కంటే కేసీఆర్ అంటే లీడర్స్ వణుకుతారని కూడా రాశారు. ఈ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.